సీఎం ఉద్ధవ్కు శివసేన ఎమ్మెల్యే లేఖ
ముంబై, జూన్ 20: బీజేపీతో మళ్లీ చేతులు కలుపాలని కోరుతూ శివసేనకు చెందిన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. ఇరు పార్టీల మధ్య పొత్తు దెబ్బతినడంతో శివసేన నేతలను కేంద్రం వేధిస్తున్నదని, ఈ వేధింపుల నుంచి నేతలను కాపాడటానికి మళ్లీ చేతులు కలుపాలని సూచించారు. ‘ఇప్పటికే పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు శివసేన నాయకులను వేధిస్తున్నాయి. అందులో నేను కూడా ఒకడిని. ఈ వేధింపుల నుంచి తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం. మళ్లీ బీజేపీతో చేతులు కలుపడమే’ అని సర్నాయక్ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఐదేండ్లూ ఉద్ధవ్కు మద్దతు
ఐదేండ్ల పాలన పూర్తయ్యేంతవరకు సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందని ఆ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోల్ ఆదివారం పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్తో ఇబ్బంది ఉండబోదని తెలిపారు.