ముప్కాల్/జక్రాన్పల్లి, మార్చి 8: ఎస్సారెస్పీ సందర్శనకు వెళ్లిన ముగ్గురు ప్రమాదవశాత్తు లక్ష్మీ కాలువలో నీట మునిగి మృతిచెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ముప్కాల్ పరిధిలోని లక్ష్మీ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద శుక్రవారం చోటుచేసుకున్నది. జక్రాన్పల్లి మండలం గన్యాతండాకు చెందిన సలావత్ వంశీ, అజ్మీర్ సందీప్, భూక్యా భాస్కర్, లోకేశ్ (17), సాయినాథ్ (16), మున్నా (17) స్నేహితులు. వీరు శుక్రవారం ఉదయం కారులో ఎస్సారెస్పీ సందర్శనకు వెళ్లారు. ప్రాజెక్టు లక్ష్మీ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద స్నానం చేసేందుకు కాలువలోకి దిగారు. ఇందులో ముగ్గురు బయటికి రాగా.. మిగతా ముగ్గురు లోకేశ్, సాయినాథ్, మున్నా గల్లంతయ్యారు. పోలీసులు.. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా సాయంత్రం ఈ ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.