హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. నర్సంపేట మండలం చిన్నగురిజాల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణమూర్తి (65) అనే వ్యక్తి కాళ్లు కడుక్కునేందుకు మనుమడు లక్కీ (12)తో కలిసి చెరువులోకి దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇద్దరు అందులోనే పడిపోయారు.
అక్కడే కృష్ణమూర్తి తనయుడు నాగరాజు (34) విషయాన్ని గమనించి తండ్రి, కొడుకునే కాపాడేందుకు చెరువులోకి దిగాడు. చెరువులో నీటమునగడంతో ముగ్గురు ఊపిరాడక మృతి చెందారు. చెరువులో పడి ముగ్గురు మృతి చెందడంతో స్థానికంగా విషాదం అలుముకున్నది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు నర్సంపేట మండలం లింగాపురం గ్రామస్తులు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.