ఖమ్మం రూరల్, నవంబర్ 27: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబీకులు దాచిన రూ.3 కోట్ల నగదును పోలీస్, టాస్క్ఫోర్స్, ఫ్లయింగ్ స్కాడ్ సోమవారం పట్టుకున్నది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్ సమీపంలో శ్రీరాంనగర్ కాలనీలోని ఓ ఇంట్లో పొంగులేటి కుటుంబీకులు నగదు దాచినట్టు సమాచారం మేరకు అధికారులు సోదాలు నిర్వహించేందుకు వచ్చారు. వీరి రాకను గమనించిన ఇద్దరు వ్యక్తులు ఇంటి గోడ దూకి పారిపోయారు. విషయం తెలుసుకున్న ఐటీ అధికారులు వచ్చి సోదా చేయగా మొత్తం రూ.3 కోట్ల నగదును గుర్తించారు.
ఆ ఇంట్లో ఉన్న చుండు కరుణను అధికారులు విచారించారు. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి, ఆయనకు చెందిన నిర్మాణ సంస్థ (రాఘవ కన్స్ట్రక్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) ప్రాజెక్ట్ మేనేజర్ జగ్గవరపు శ్రీకాంత్రెడ్డి కలిసి అక్టోబర్లోనే ఈ నగదును తమ ఇంట్లో ఉంచినట్టు ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై అభిమానంతోనే ఆ డబ్బును తమ ఇంట్లో ఉంచడానికి అంగీకరించినట్టు వెల్లడించారు. ఆ డబ్బును ఆదివారం అర్ధరాత్రి తీసుకెళ్లేందుకు ఓ ఇద్దరు వ్యక్తులు వచ్చారని, పోలీసులను చూసి తప్పించుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఆ డబ్బుతోపాటు కాంగ్రెస్ పార్టీ టవల్స్, జెండాలను అధికారులు పరిశీలించారు. నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ైరూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.