మంగపేట, డిసెంబర్ 17: శబరిమ ల అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని ఇంటికి తిరిగి వస్తుండగా తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ములు గు జిల్లాకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. బాధిత కు టుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకా రం.. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన తలారి సుబ్బయ్య నాయుడు (49), నర్రా సాంబశివరావు (51), నిమ్మల వెంకటరాజు (60), జరుపుల రాము, కూనూరు అజయ్ అయ్యప్ప మాల ధరించి 41 రోజులపాటు దీక్ష పూర్తి చేసుకున్నారు.
ఈ నెల14న ఏ టూరునాగారానికి చెందిన ఓ అద్దె కారులో శబరిమల వెళ్లారు. దర్శనం చేసుకొని ఆదివారం బయలు దేరారు. మధ్యాహ్నం తమిళనాడులోని తెని జిల్లా పెరియాకుళం మండలం దేవనపట్టి బైపాస్ రోడ్డు మీదుగా వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న వాల్ను ఢీకొట్టడంతో అందులో ఉన్న సుబ్బయ్యనాయుడు, సాంబశివరావు, వెంకటరాజుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. కూనూరు అజయ్, జరుపుల రాముకు గాయాలయ్యాయి. వీరిని స్థానికులు అక్కడే ఓ దవాఖానలో చేర్పించారు. ఈ ఘటనతో కమలాపురంలో తీవ్ర విషాదం అలుముకున్నది. పంచనామా ప్రక్రియ పూర్తి చేయించి మృతదేహాలను తీసుకొచ్చేందుకు బంధువులు తమిళనాడు వెళ్లారు.