వీర్నపల్లి, జూన్ 27: అంధత్వ నివారణే లక్ష్యంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ హయాంలో కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేశారని రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య గుర్తుచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో ఏర్పాటు చేసిన కేసీఆర్ కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ మల్లారపు జ్యోత్స్నతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆగయ్య కంటి పరీక్షలు చేయించుకొని, కండ్లద్దాలను తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దృష్టి లోపంతో ఎవరూ ఇబ్బంది పడవద్దని 2018లో కేసీఆర్ ప్రభుత్వం కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు శ్రీకారం చుట్టిందన్నారు.
వీర్నపల్ల్లి మండల ప్రజలు అంధత్వం బారినపడకుండా వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కంటి పరీక్షలు చేయించుకునే వెసులుబాటు లేనివాళ్లు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా వీర్నపల్లి క్లస్టర్ పరిధిలో ఎనిమిది గ్రామాల నుంచి మొదటిరోజు 320 మంది తరలిరాగా సభేరి ఐ హాస్పిటల్కు చెందిన 20 మంది నిపుణులు కంటి పరీక్షలు చేశారు. అవసరమైన వారికి కండ్లద్దాలు అందించగా, ఆపరేషన్ అవసరమైన వారికి సిఫారసు చేశారు.