హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే ఢిల్లీలో ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఆ పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ఢిల్లీలో నోటీసులు ఇస్తే రాష్ట్రంలో ఆందోళనలు చేయటం ఏమిటని ధ్వజమెత్తారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు తమ నాయకుల మీద ప్రేమ ఉంటే ఢిలీకి వెళ్లి ప్రధాని మోదీ కార్యాలయం ముందో, ఇంటి ముందో, లేదంటే ఈడీ కార్యాలయం ముందో ధర్నా చేయాలి కానీ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆందోళనలు చేయటం దేనికని ప్రశ్నించారు. గురువారం బీఆర్కే భవన్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి.. కాంగ్రెస్ మహిళా నేత హైదరాబాద్లో ఎస్సై కాలర్ పట్టుకొని తన అహంకారాన్ని ప్రదర్శించటం దుర్మార్గమని దుయ్యబట్టారు.
ఇలాంటి చర్యలను తమ ప్రభుత్వం సీరియస్గా తీసుకొంటుందని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినవారిని అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ దివాళా తీసిందని, బీజేపీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతున్నదని తెలిపారు. ఆ రెండు పార్టీలకు ఒక్కో నియోజకవర్గానికి కనీసం ఐదుగురు కూడా ఉండరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ.. రాష్ట్రంలో లేని సమస్యను సృష్టించి ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉన్నదని, ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేయాలని చూసేవాళ్ల ఆటలు సాగవని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు జాతీయ రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉన్నదని, సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆయనే అన్ని విషయాలు వెల్లడిస్తారని మల్లారెడ్డి చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఇద్దరివీ ఐరన్ లెగ్లేనని, వాళ్లిద్దరు ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతంలో వానలు పడవని విమర్శించారు.