తొర్రూరు : పరీక్ష రాస్తుండగా గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే కేంద్రం వద్ద ఉన్న భర్తకు తెలపడంతో హుటాహుటి న సమీప ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యారోగ్య సిబ్బంది మెరుగైన చికిత్స అందించి సుఖప్రసవం చేయడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ దంపతులు ఆనందంతో వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞత తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. దంతాలపల్లి మండలం గున్నపల్లి గ్రామ శివారులోని మర్రిలెంటు తండాకు చెందిన ధరావత్ మమత తొర్రూరులోని ఓ ఒకేషనల్ కళాశాలలో ఎంపీహెచ్డబ్ల్యూ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె ప్రస్తుతం గర్భవతి.
మమత పరీక్ష రాస్తుండగా అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా.. వైద్యారోగ్య సిబ్బంది ప్రాథమికంగా చికిత్స మొదలుపెట్టారు. మమతకు తొలికాన్పు కావడంతో ఇబ్బందులు కాకుండా స్థానికంగా ఉన్న అమ్మ ఆస్పత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ మిథాలీరాజ్ను సంప్రదించడంతో ఆమె వచ్చి వైద్యులకు సహకారాన్ని అందించి సుఖ ప్రసవం చేశారు. మగబిడ్డకు మమత జన్మనివ్వగా, తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. మమత భర్త సురేష్, కుటుంబ సభ్యులు వైద్యాఆరోగ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. చికిత్స అందించిన వారిలో డాక్టర్లు ప్రియాంక, నందన, హెడ్ నర్సు సుగుణ, స్టాఫ్ నర్సు గౌతమి, నవిత ఉన్నారు. వైద్యులు స్పందించిన తీరుపై కలెక్టర్ శశాంక, జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీశ్రాజ్, డిప్యూటీ డీఎంహెచ్వో మురళీధర్ అభినందనలు తెలిపారు.