Elections | హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): వరుస ఎన్నికలతో 2024 ఎన్నికల నామ సంవత్సరంగా మారనున్నది. రాష్ట్రంలో అత్యధికకాలం ఎన్నికలతోనే గడిచే అవకాశమున్నదని రాజకీయరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వరుసగా రాజ్యసభ, లోక్సభ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి.
మార్చిలో రాజ్యసభ సభ్యులు సంతోష్కుమార్, లింగయ్యయాదవ్, వద్దిరాజు రవిచంద్ర స్థానాలకు, మార్చి, ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక ఉంటుంది. వీటితోపాటు ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో మహబూబ్నగర్ జిల్లా స్థానానికి ఉప ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. ఇలా మొత్తం 17 లోక్సభ స్థానాలు, 3 రాజ్యసభ స్థానాలు, 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ఉంటాయి. వీటితోపాటు స్థానిక సంస్థల పదవీకాలం ఈ ఏడాదే ముగియనున్నది.
ప్రస్తుతం కొనసాగుతున్న సర్పంచ్లు 2019 ఫిబ్రవరి 2న బాధ్యతలు స్వీకరించారు. వారి పదవీ కాలం ఫిబ్రవరి 1తో ముగియనున్నది. ప్రస్తుత ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు 2019 జూన్ 7న ఎన్నికయ్యా రు. వారి పదవీకాలం జూన్ 6తో పూర్తవుతుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారెంటీలతోపాటు ఇతర హామీలను నెరవేర్చాల్సి ఉన్నది. రాజ్యసభ, లోక్స భ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యం లో ఈ ఏడాదిలో అత్యధిక కాలం ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. దీంతో కొత్త సర్కారు హామీలను అమలు చేసేందుకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోగానే హామీలన్నింటినీ అమలు చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.