ఒకనాడు సాగునీటి కోసం అల్లాడిన పల్లెలు అవి. పేరుకు కృష్ణా నది పక్కనే ఉన్నా భూములు బీళ్లుగా మారిన పరిస్థితి. చేతిలో భూమి ఉన్నా సాగు నీరు లేక రైతులు తల్లడిల్లేవారు. నల్లగొండ జిల్లా దామరచెర్లలో ఇది ఏడేండ్ల క్రితం దుస్థితి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్కాకతీయ ఈ ప్రాంతంలో తడి ఆరని నేలను సాకారం చేసింది. ఇక్కడి చెరువులు, కుంటలు నేడు జలసిరులతో కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు పెరిగాయి. గుట్టల మీద సైతం బోర్లు పుష్కలంగా పోస్తుండటంతో రైతులు రెండు కార్లు వరి పండిస్తున్నారు.
Ground water level | దామరచర్ల, మే 3 : నల్లగొండ జిల్లాలో ఒకనాడు సాగునీటి కోసం అల్లాడిన పల్లెలు నేడు జలసిరులతో కళకళలాడుతున్నాయి. మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలమే ఇందుకు సాక్ష్యం. పేరుకు ఈ ప్రాంతం కృష్ణానది ఒడ్డునే ఉన్నా ఇక్కడి భూములు బీళ్లుగానే దర్శనమిచ్చేవి. చివరి భూముల రైతులు నీళ్లందక నానా అవస్థలు పడేది. నర్సాపురం, రాజగట్టు, తిమ్మాపురం, కల్లేపల్లి, పుట్టలగడ్డతండా గిరిజనులు ఏడేండ్ల కిందటి వరకూ దుర్భర కరువు పరిస్థితులు ఎదుర్కొన్నారు. చేతిలో భూమి ఉన్నా చెమ్మ నీరు లేక తల్లడిల్లేవారు. వేసిన పంటలను కాపాడుకునేందుకు పదుల సంఖ్యలో బోర్లు వేసినా నీటి జాడ కనపడకపోయేది. అప్పులపాలై వ్యవసాయాన్ని వదిలి రోజు కూలీలుగా మారిన వారు అనేకమంది ఉన్నారు. ఉన్నచోట ఉపాధి లేక వలస బాట పట్టిన వారూ ఉన్నారు.
ఎక్కడైనా ఒక బోరు కొద్దోగోప్పో నీళ్లు పోసినా వచ్చిపోయే కరెంటుతో ఒక్క మడి కూడా పారేది కాదు. లో ఓల్టేజీ కారణంగా మోటర్లు కాలిపోయి రైతులపై మరింత భారం పడేది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంకల్పంతో ఆ కన్నీటి వ్యథలు పూర్తిగా తుడుచుకుపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్కాకతీయ ఈ ప్రాంతంలో తడి ఆరని నేలను సాకారం చేసింది. చెరువులు, కుంటల్లో పూడిక తీసి ఏటా రెండు సీజన్లలో నాగార్జునసాగర్ జలాలతో నింపుతుండటంతో భూగర్భజలాలు పెరిగాయి. ఫలితంగా ఇప్పుడు ఎక్కడ బోరు వేసినా నీళ్లు పడుతున్నాయి. వలసలు వాపస్ అయ్యాయి. రోజు కూలీలుగా మారిన రైతులు తిరిగి వ్యవసాయం బాట పట్టారు.
గుట్టల మీద సైతం బోర్లు పుష్కలంగా పోస్తుండటంతో రెండు కార్లు వరి పండిస్తున్నారు. దాంతోపాటు ప్రతి ఏడాది అనుకున్న రీతిలో వానలు పడటమూ కలిసి వచ్చింది. రైతులు వేసిన బోర్లన్నీ సక్సెస్ అవడంతో ఈ ప్రాంతం పచ్చని పంటలతో కళకళలాడుతున్నది. గతంలో నెర్రెలు బారిన నర్సాపురం చెరువు నిండుకుండను తలపిస్తున్నది. ఫలితంగా పరిసర ప్రాంతాల్లో నీరు సమృద్ధిగా లభిస్తున్నది. నిండు వేసవిలోనూ దామరచర్ల మండలంలోని చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. వేసవిలో సైతం బోర్లు ఆగకుండా పోస్తున్నాయి. ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందిస్తుండటంతో ఇక్కడి రైతులు ఇబ్బందుల్లేకుండా రెండు పంటలు వరి పంట పండిస్తున్నారు.