హైదరాబాద్ : రైతు బంధు పథకం 2018 సంవత్సరంలో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో 74 వేల 193 మంది రైతులకు 721 కోట్ల 67 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం అందజేశామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
అందులోభాగంగానే పాలకుర్తి మండలంలో 18 వేల 422 రైతులకు 186 కోట్ల 7 లక్షల రూపాయలు, దేవరుప్పుల మండలం లో 14 వేల 570 రైతులకు 147 కోట్ల 12 లక్షల రూపాయలు, కొడకండ్ల మండలం లో 7 వేల 733 రైతులకు 77 కోట్ల 62 లక్షల రూపాయలు, తొర్రూరు మండలం లో 11 వేల 687 రైతులకు 112 కోట్ల రూపాయలు, పెద్దవంగర మండలంలో 6 వేల 481 రైతులకు 62 కోట్ల రూపాయలు, రాయపర్తి మండలంలో 15 వేల 301 రైతులకు 138 కోట్ల రూపాయలు రైతుబంధు ఆర్థిక సహాయం అందజేశామని ఆయన చెప్పారు.
రైతుబంధు సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని, ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 65 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేసిన మొత్తం 50 వేల కోట్ల రూపాయలకు చేరడం గొప్ప విషయమన్నారు.
ఇది సువర్ణాక్షరాలతో లిఖించే సందర్భం అని, సీఎం కేసీఆర్ మహా సంకల్పానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన తెలిపారు. 70 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఏనాడు, ఎవరు చరిత్రలో ఎప్పుడూ అందించని విధంగా రైతుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన గొప్ప కార్యక్రమమైన రైతుబంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు సంబరాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయని ఆయన తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సంక్రాంతి వరకు రైతుబంధు సంబరాలు నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.