KTR | కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదు.. 420 హామీలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ విమర్శలను, ఆరోపణలను ధీటుగా తిప్పికొట్టామని చెప్పారు. ఇక స్వయంగా కేసీఆరే అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేరు అని అన్నారు. పార్లమెంటు ఎన్నికల సన్నాహక సదస్సుల్లో భాగంగా భువనగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పాటించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశాలకు హాజరైన కేటీఆర్.. ప్రజలు తప్పుచేశారని అనడం సరైంది కాదని.. పార్టీ నాయకులు అలా మాట్లాడకూడదని హితవుపలికారు. రెండుసార్లు బీఆర్ఎస్ను గెలిపించింది కూడా మన ప్రజలే అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ను ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించలేదని అన్నారు. చాలా చోట్ల స్వల్ప తేడాతోనే ఓడిపోయామని గుర్తు చేశారు. ఓటమిని సమీక్షించుకుని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొందామని పిలుపునిచ్చారు. భువనగిరి సీటుతో సహా మెజారిటీ స్థానాలను సాదిద్ధామని అన్నారు. ప్రజలు ఫలితాల్లో భిన్నత్వాన్ని చూపించారని.. ఎందుకిలా జరిగిందో విశ్లేషించుకుందామని వ్యాఖ్యానించారు. సమీక్షలో వెల్లడైన అభిప్రాయాలను ఏరోజుకారోజు కేసీఆర్కు నివేదిస్తున్నామని తెలిపారు.
నూతన ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలని అనుకుంటే.. కాంగ్రెస్ రెచ్చగొట్టే వైఖరిని ప్రదర్శిస్తోందని కేటీఆర్ తెలిపారు. కుదురుకునే ప్రయత్నం మానేసి ఎలాగోలా కాలం వెళ్లదీయాలని కొత్త ప్రభుత్వం ఎత్తుగడ వేసిందని అన్నారు. అధికారం కోసం అలవిగాని హామీలిచ్చి.. ఇవాళ అమలు చేయలేక చేతులెత్తేస్తున్నారని విమర్శించారు. ప్రజల దృష్టి మరల్చేందుకే శ్వేతపత్రాల పేరుతో నాటకాలడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అసెంబ్లీలో కాంగ్రెస్ విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టామని.. ఇక స్వయంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేరని అన్నారు.రైతుబంధు రాక, కరెంటు కోతలతో గ్రామాల రైతులు, ప్రజలు అసహనంతో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. నిరుద్యోగ భృతి, పాలమూరు-రంగారెడ్డి జాతీయ హోదాలపై ప్రభుత్వం నాలుక మడతేసిందని కేటీఆర్ విమర్శించారు. యాసంగి వరి నాట్లకు ఎదురుచూస్తున్న రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. రైతుబంధు ఆపేయడం కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక ధోరణికి నిదర్శనమని అన్నారు. రైతు రుణమాఫీ, పింఛన్ల పెంపును డిసెంబర్ 9 వరకు అమలు చేస్తామని అన్నారని.. ఏమైందని ప్రశ్నించారు.
ఓటమి తమకు కొత్తేం కాదని.. అది స్పీడ్ బ్రేకర్ వంటిదేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిలదీయాలని సూచించారు. కారు షెడ్డుకు పోలేదని.. సర్వీసింగ్కు మాత్రమే వెళ్లిందని కేటీఆర్ అన్నారు. పదేండ్లపాటు విరామమెరుగక పనిచేసిన కారు.. మరింత స్పీడ్గా వెళ్లేందుకు సర్వీసింగ్కు పోయిందని వ్యాఖ్యానించారు.. రాబోయే పార్లమెంటు, స్థానిక ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసేలా సత్తా చాటాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో కాంగ్రెస్కు సరైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సే అని వ్యాఖ్యానించారు.