హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం గ్రామాలను కేంద్ర ప్రభుత్వం ఆదర్శ గ్రామాలుగా ప్రకటించింది. ఇది అరుదైన ఘనత, సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాల ద్వారా సాధ్యమైందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని, దేశంలో మొత్తానికి మొత్తం ఆదర్శ గ్రామాలున్న రాష్ట్రం విరాజిల్లుతుందని అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల పథకాల అమలు తీరుపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్ సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..ఉపాధి హామీ నిధుల వినియోగంలో మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు. తాజాగా పంచాయతీ భవనాలు, కాలువల పూడిక తీత వంటి పనులకు కూడా ఉపాధి నిధులను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. అంతేగాక ఈ మార్చిలో గా సాధ్యమైనంత ఎక్కువ ఉపాధి పనులు చేయాలని అదేశించారు.
కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన గ్రామ పంచాయతీలు, sc రిజర్వు గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణాలకు st, sc sub plan నిధుల వినియోగం పై సీఎం గారి ఆదేశానుసారం నడుచుకుంటానని అన్నారు. ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, రోడ్ల నిర్వహణ వంటి విషయాల్లో అధికారులు ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని అభివృద్ధి పనులు నిర్వహించాలన్నారు. కొత్త రోడ్లు, మురుగునీటి కాలువల పనులు కూడా త్వరలోనే వస్తాయని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.
మరోవైపు గ్రామ కార్యదర్శులకు gio tagging పెట్టామని,మహబూబ్నగర్ జిల్లాలో కార్యదర్శులు, అధికారులు మరికొంత అప్రమత్తంగా పనిచేయాలని మంత్రి అదేశించారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని నిలబెట్టుకోవడం మన విధి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. డంపింగ్ యార్డులలో చెత్త ద్వారా తీసిన ఎరువుల అమ్మకం ద్వారా రాష్ట్రంలో పంచాయతీలు 300 కోట్లు అర్జించాయని మంత్రి వివరించారు. అలాగే, స్కూల్స్ లో నర్సరీలను ఏర్పాటు చేసి, ప్లాంటేషన్ పెడితే, గ్రామ పంచాయతీలకు భారం తగ్గుతుందని సూచించారు.
మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధిహామీ కింద కాలువల పూడిక తీయాలి. కల్వకుర్తి ఎత్తిపోతల పంప్ హౌస్ లోకి నీళ్లు వచ్చే ఇన్ ఫాల్ రెగ్యులేటర్ వెంటనే నిర్మించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని వెంటనే నిర్మించాలని గతంలోనే ఆదేశించారని తెలిపారు. పల్లె ప్రకృతి వనాలలో ఏర్పాటులో రాష్ట్రంలో వనపర్తి అగ్రభాగాన నిలిచిందని పేర్కొన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గతంలో సీఎం కేసీఆర్ ఆదేశించిన మేరకు కోయిల్ సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని డ్రింకింగ్ వాటర్ కు కేటాయించాలన్నారు. మన్నెం కొండ టెంపుల్ వద్ద వాటర్ టాంక్ కట్టాం. Waste water ను కింద చెరువుకు పోవాలి అన్నారు. ఇక్కడ ఈ మేరకు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎంపీ మన్నెం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు కూచకుల్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, పీవీ వాణి దేవి, ఎమ్మెల్యేలు చర్లకోల లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, మహేశ్వర రెడ్డి, చిట్టెం రామ్ మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, అబ్రహం, పట్నం నరేందర్ రెడ్డి, జైపాల్ యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, క్రాంతి కిరణ్ అధికారులు పాల్గొన్నారు.