Khammam | ఉద్యమాల ఖిల్లా… పోరాటాల గడ్డ… త్యాగాల చరిత్ర ఖమ్మం జిల్లాది. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించింది. తెలంగాణ ఏర్పాటులోనూ జిల్లా ప్రత్యేకతను చాటుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖమ్మం జిల్లా అభివృద్ధి, సంక్షేమంలో ముందంజలో ఉన్నది. బీఆర్ఎస్ నేతృత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మరోసారి ఖమ్మం గుమ్మంలో గులాబీ జెండాను ఎగురవేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
సీఎం కేసీఆర్ విజన్తో ఖమ్మం నియోజకవర్గం అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తున్నది. మంత్రి పువ్వాడ చొరవతో తొమ్మిదేండ్లలో వేల కోట్ల పనులు జరిగాయి. రూ. 4 కోట్లతో లకారం చెరువు సుందరంగా ముస్తాబైంది. 84వేల గృహాలకు స్వచ్ఛ తాగునీరందుతున్నది. నిరుపేదల కోసం 1210 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించింది. ఐటీ హబ్ మొదటి దశ పూర్తవగా, రెండో దశ నిర్మాణానికి రూ.36కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.
మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ప్రజావసరాల దృష్ట్యా వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తున్నది. ఖమ్మం నగరపాలక సంస్థ ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం రూ. 2వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. రూ. 4 కోట్లతో లకారం చెరువును సుందరీకరించారు. రూ. 100 కోట్లతో గోళ్లపాడు చానల్, రూ. 23 కోట్లతో నూతన మున్సిపల్ కార్పొరేషన్ భవనాలను నిర్మించారు. మిషన్ భగీరథ అమృత్ పథకంలో రూ. 229 కోట్లతో మంచినీటి సరఫరా పనులు పూర్తయ్యాయి. ఇంటింటికీ నల్లా పథకంలో 84 వేల గృహాలకు నల్లాలు, 21,946 ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేశారు. రూ. 70 కోట్లతో ధంసలాపురం ఆర్వోవీ బ్రిడ్జిని నిర్మించారు. ముస్తాఫానగర్ నుంచి ధంసలాపురం గేటు వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఖమ్మం నగరంలోని నిరుపేదలకు టేకులపల్లి వద్ద 1,210 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించారు. వాడవాడలా సీసీ రోడ్లు, సైడు కాల్వలు, కూరగాయల మార్కెట్లు, వైకుంఠధామాల నిర్మాణాలు చేశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ కమిషనరేట్ను ఏర్పాటు చేశారు. ప్రజావసరాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చేందుకు రూ. 10 కోట్లతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు. ఖమ్మం నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఎన్నెస్పీ క్యాంపులో రూ.25 కోట్లతో నూతన బస్స్టాండ్ ను నిర్మించారు.
సాంకేతిక విద్యను అభ్యసిస్తూ ఉద్యోగ వేటలో సుదూర ప్రాంతాలకు తరలివెళుతున్న ఖమ్మం యువత కోసం మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ‘ఐటీహబ్’ను తీసుకువచ్చారు. రూ. 25 కోట్లతో మొదటి దశ నిర్మాణం పూర్తయ్యింది. మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రెండవ దశ నిర్మాణానికి రూ.36 కోట్లు మంజూరు అయ్యాయి.
ఖమ్మం నియోజకవర్గంలో 1100 మంది దళితులకు రూ. 10 లక్షల చొప్పున దళితబంధు అందజేశారు. నియోజకవర్గంలోని బీసీలకు 300 మందికి లక్ష చొప్పున రుణాలను అందజేశారు. విడతల వారీగా బీసీలందరికీ రుణాలు అందించేలా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది.