Uttam Kumar Reddy | హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): కృష్ణా సాగునీటి ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగిస్తామని తమ ప్రభుత్వం కేంద్రానికి హామీ ఇవ్వలేదని, ఇస్తామని కూడా చెప్పలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ…ఈ విషయంపై గతంలోనే తప్పు జరిగిందని అన్నారు. ఈ అంశాన్ని శాసనసభలో చర్చకు పెడతామని తెలిపారు.
ఇటీవల కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను తాను, సీఎం రేవంత్రెడ్డి కలిసినప్పుడు కృష్ణా ప్రాజెక్టులను యథావిధిగా ఉంచాలని కోరినట్టు చెప్పారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి..రెండు రాష్ర్టాల సీఎంలు కలిసి అపెక్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే కేంద్రం ఆలోచనను చెప్తామని అన్నట్టు వెల్లడించారు. గత సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ గంటల కొద్ది మాట్లాడుకొని ఏం చేశారని ప్రశ్నించారు.
పదేండ్లలో కృష్ణా నీటివాటా ఎందుకు తగ్గిందని నిలదీశారు. గ్రావిటీ ద్వారా వచ్చే కృష్ణా నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల పరిస్థితి ఏంటని విలేకరుల ప్రశ్నించగా గతంలో ఎలా ఉన్నదో ఇప్పుడు అలాగే ఉన్నదని తెలిపారు. మేడిగడ్డలో ఊహించినదానికన్నా ఎక్కువ నష్టం జరిగిందని చెప్పారు.
డిజైన్, నిర్మాణ లోపంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. మేడిగడ్డలో ఏం జరిగిందో తేల్చేందుకు ఇంకా సమయం పడుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు మూలాలే కూలిపోయే పరిస్థితి ఉన్నదని తెలిపారు. ఇందుకు సంబంధించి కొన్ని ఫొటోలు తనకు అందాయని, వీటిని త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు.