హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): దేశంలో తీవ్ర అసమానతలు నెలకొన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మఖ్దూం భవన్లో మంగళవారం ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు డీ పాపారావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత కేంద్ర బడ్జెట్ అసమానతలు పెంచే విధంగా ఉన్నదని విమర్శించారు. దేశం ఇప్పటికే పేదల భారత్, సంపన్నుల భారత్గా విడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థల భారీ నష్టాలకు కారణమైన అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దేశ ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థ, బడ్జెట్పై పాపారావు విశ్లేషించారు.