CPI | హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రాజకీయాల్లో పార్టీలు గెలుపు కోసం ఎన్నో వ్యూహాలు అనుసరిస్తుంటాయి. కానీ తప్పనిసరిగా ‘మిత్రధర్మం’ పాటిస్తుంటాయి. ఒక లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఒక పార్టీతో స్నేహం కుదిరిన తర్వాత లేదా పొత్తు పెట్టుకున్న తర్వాత దానిని సాధించే వరకు ఆ బంధాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం ఈ మిత్రధర్మాన్ని తప్పాయి. ఒకవైపు హైదరాబాద్లో బీఆర్ఎస్తో స్నేహం చేస్తున్నామని చెప్తూనే మరోవైపు ఢిల్లీలో కొత్త కూటమిలో చేరి మోసంచేశాయి. ఒక జాతీయ పార్టీ అయిన బీఆర్ఎస్తో పొత్తులో ఉండగానే మరో జాతీయ పార్టీతో (కాంగ్రెస్) చేతులు కలిపాయి. అందుకే సీఎం కేసీఆర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కఠిన నిర్ణయం తీసుకున్నారు. మిత్రధర్మం పాటించని లెఫ్ట్ పార్టీలతో పొత్తు ఉండబోదని ప్రకటించారు. దీంతో తమ తప్పును కప్పిపుచ్చుకొనేందుకు లెఫ్ట్ పార్టీల నేతలు గురివింద గింజ సామెత మాదిరిగా వ్యవహరిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా లెఫ్ట్ పార్టీల నేతలను ఆహ్వానించి చర్చలు జరిపారు.
రాజకీయంగా కలిసి వెళ్లాలని అవగాహన కుదుర్చుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కలిసి ప్రచారం చేశాయి. బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత కూడా సీఎం కేసీఆర్ మిత్రధర్మాన్ని కొనసాగించారు. ఈ ఏడాది జనవరిలో ఖమ్మం వేదికగా నిర్వహించిన కంటివెలుగు రెండో విడత కార్యక్రమానికి రెండు లెఫ్ట్ పార్టీల జాతీయ నేతలను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. సీపీఎం నుంచి కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. అందరూ సీఎం కేసీఆర్తోపాటు వేదికను పంచుకున్నారు. పినరాయి విజయన్, డీ రాజా ప్రత్యేకంగా ప్రసంగించారు. ఆ తర్వాత సైతం అనేక సందర్భాల్లో రాష్ట్ర మంత్రులు వామపక్షాలతో స్నేహం కొనసాగుతుందని స్పష్టంచేశారు. లెఫ్ట్ పార్టీలు సైతం బీఆర్ఎస్తో తమ స్నేహం కొనసాగుతుందని ప్రకటించారు.
ధర్మాన్ని మరిచి కొత్త పార్టీ వైపు..
దేశాన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్, బీజేపీలే పాలిస్తున్నాయని, ఇప్పుడు దేశంలో ఉన్న దరిద్రానికి ఆ పార్టీలే కారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే చెప్తున్నారు. కేంద్రంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చారు. జాతీయ పార్టీగా ప్రకటించారు. దేశంలో గుణాత్మక మార్పును తీసుకొచ్చే క్రమంలో కలిసొచ్చే పార్టీలతో స్నేహం చేస్తామని ప్రకటించారు. సీపీఐ, సీపీఎంతో స్నేహాన్ని కొనసాగించారు. కానీ, రెండు లెఫ్ట్ పార్టీలు మిత్రధర్మాన్ని మరిచాయి. కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త కూటమిలో (ఇండియా) చేరాయి. కనీసం ఈ విషయంలో సీఎం కేసీఆర్ను సంప్రదించలేదు. దీంతో సీఎం కేసీఆర్ ఆ రెండు పార్టీలను పక్కనపెట్టేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 115 మంది అభ్యర్థులను ప్రకటించారు.
తీరా ఇప్పుడు తమను మోసం చేశారంటూ ఆ రెండు పార్టీల నేతలు ప్రెస్మీట్లు పెట్టి వాపోతున్నారు. దీంతో లెఫ్ట్ పార్టీల నేతలపై రాజకీయ విశ్లేషకులు మండిపడుతునారు. ఒక పార్టీతో పొత్తులో ఉండి, వెన్నుపోటు పొడిచి, కొత్త కూటమిలో చేరడాన్ని ఏమంటారో చెప్పాలని నిలదీస్తున్నారు. జాతీయ పార్టీ అయిన బీఆర్ఎస్తో స్నేహం చేస్తూ, మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్తో చేతులు కలుపడాన్ని ఏమంటారని ప్రశ్నిస్తున్నారు. తమ పొత్తు రాష్ట్ర స్థాయికే పరిమితం అంటూ సన్నాయి నొక్కులు నొక్కడాన్ని సైతం తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇదే నిజమైతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఇండియా కూటమి (కాంగ్రెస్) అభ్యర్థులకు మద్దతు పలుకుతారా? లేదా బీఆర్ఎస్కు మద్దతు పలుకుతారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గాలివాటంగా పొత్తుల పేరుతో బలమైన పార్టీలకు దగ్గరవడం, మరో పార్టీ కనిపించగానే అవకాశవాదంతో అటువైపు వెళ్లిపోవడం లెఫ్ట్ పార్టీలకు కొత్తేమి కాదని మండిపడుతున్నారు.