మేడ్చల్ కలెక్టరేట్, మార్చి 8 : సమాజ నిర్మాణంలో మహిళలే కీలకమని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని( కేసీఆర్ మహిళా బంధు) ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యమ కారులను, అశ వర్కర్లను, అంగన్ వాడీ టీచర్లను, వైద్య సిబ్బంది, సంఘ సేవకులను, మహిళా కౌన్సిలర్లను, డ్వాక్రా సంఘాల మహిళలు, తదితరులను మంత్రి మల్లారెడ్డి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన 50 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థలలో నేడు సగం మంది మహిళలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారన్నారు.
ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. మహిళలకు, బాలికలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు అందించి మహిళల కష్టాలు తీర్చిన ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు.
మున్సిపల్ కమిషన్లు వాణిరెడ్డి, స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు కౌకుట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత, వైస్ చైర్మన్లు మల్లేష్ యాదవ్, మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.