మహబూబ్నగర్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ఎన్నికల సమయంలో అన్ని శాఖల అధికారులు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయాలి. కానీ పాలమూరులో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. పోలీసు అధికారులే మొత్తం నడిపిస్తున్నారు. వారే అన్ని శాఖల పనులు చేస్తున్నారు. కొందరు పోలీసులు పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు’ అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మహబూబ్నగర్లోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్నగర్లో సామాన్యులు స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. పోలీసులు అంతా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ పోలీస్కు దేశంలో మంచి పేరు ఉన్నదని, కానీ కొందరు పోలీసు అధికారుల తీరుతో చెడ్డపేరు వస్తున్నదని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థుల వెంట పెద్ద మొత్తంలో కార్యకర్తలను అనుమతించారని, బీఆర్ఎస్ వారి వెంట మాత్రం నిబంధనల పేరుతో కేవలం ముగ్గురిని మాత్రమే పంపించారని ఆరోపించారు.
ఇదెక్కడి న్యాయం అని శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిళ్లు తెచ్చారని, వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు తలెత్తినట్టు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ లేదని మాట్లాడుతున్న వారు తమ పార్టీని చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా పోలీసుల తీరు మారకపోతే ఉద్యమాలు షురూ అవుతాయని హెచ్చరించారు.