Telangana | ప్రతి పథకం ఒక చరిత్ర.. ప్రతి అడుగు ఒక విప్లవం.. ప్రతి నిర్ణయం ఒక సంచలనం.. దేశం అసాధ్యం అనుకొన్న ప్రతి పనినీ తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదేండ్ల్లలో నిజం చేసి చూపించింది. ఒక దేశం, ఒక రాష్ట్రం అభివృద్ధికి ప్రధాన కొలమానాలనే అన్ని అంశాల్లోనూ ఇప్పుడు తెలంగాణదే అగ్రస్థానం. ఇది అంత ఆషామాషీగా ఏమీ రాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవిరళ కృషి, మొక్కవోని సంకల్పానికి ఈ ప్రగతి నిదర్శనంగా నిలుస్తున్నది. దేశ ఆర్థిక ప్రగతికి చోదకశక్తిగా భావించే డజను కీలకాంశాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి అద్భుతం. అన్ని రాష్ర్టాలకు అనుసరణీయం.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) సంపద సృష్టించడం, దాన్ని రెట్టింపు చేయడం ఎలాగో యావత్తు భారతావనికి తెలంగాణ బోధిస్తున్నది. ఒక రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించడం, వాటిని సమర్థంగా అమలు చేయడం చెప్పినంత తేలికకాదు. అయితే, సీఎం కేసీఆర్ మాత్రం కేవలం తొమ్మిదేండ్లలోనే అది చేసి చూపించారు. అందుకే ఆర్థిక వ్యవస్థకు, దేశాభివృద్ధికి కీలకంగా పరిగణించే జీఎస్డీపీ, తలసరి ఆదాయం, స్థాపిత విద్యుత్తు సామర్థ్యం, తలసరి విద్యుత్తు వినియోగం, వ్యవసాయానికి సాగునీరు, పంటల సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి, ప్రాజెక్టుల్లో నీటి నిల్వ, ఐటీ ఉద్యోగాల కల్పన, ఐటీ ఎగుమతులు, వైద్యవిద్య కాలేజీలు-సీట్లు, గురుకుల పాఠశాలల ఏర్పాటు ఇలా అన్నింట్లో 100 నుంచి 400 శాతానికి పైగా వృద్ధిరేటును నమోదు చేసింది. సీఎం కేసీఆర్ విజన్తో 12 రంగాల్లో దేశానికే దిక్సూచిలా మారింది.
దేశానికే తల‘సిరి’
తలసరి ఆదాయ వృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. 2013-14లో తెలంగాణ తలసరి ఆదాయం రూ. 93,151గా ఉంటే, ప్రస్తుతం అది రూ. 3,12,398కి చేరింది. దేశ సగటు తలసరి ఆదాయం రూ. 1,72,000 కంటే తెలంగాణ తలసరి ఆదాయం రూ. 1,40,398 ఎక్కువ.
జీఎస్డీపీ జిగేల్
ఒక రాష్ట్ర ప్రగతికి జీఎస్డీపీనే ప్రామాణికం. దేశ జనాభాలో 2.9% వాటా మాత్రమే కలిగిన తెలంగాణ.. దేశ జీడీపీలో 4.9% వాటాను కలిగి ఉన్నది. 2013-14లో తెలంగాణ జీఎస్డీపీ రూ.3.78 లక్షల కోట్లుగా ఉంటే, 2023 నాటికి రూ.13.28 లక్షల కోట్లకు చేరింది. అంటే 9 ఏండ్లలో జీఎస్డీపీ మూడున్నరరెట్లు పెరిగింది.
ఐటీ ఎగుమతుల్లో పైపైకి
తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఐటీ ఎగుమతులు మూడు రెట్లు పెరిగాయి. 2014లో రూ. 66,276 కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు.. 2023 నాటికి రూ. 2,41,275 కోట్లకు ఎగబాకింది. 264 శాతం పెరుగుదలతో ఐటీ ఎగుమతుల్లోనూ ఏ రాష్ట్రమూ తెలంగాణకు సాటిరాదని నిరూపించింది.
సాగు విస్తీర్ణం రెట్టింపు
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ సాగునీటి గోస తీర్చడంపై దృష్టి సారించారు. దీంతో 2014-15లో యాసంగి, వానకాలం కలిపి 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం, 2022-23లో 2.౩ కోట్ల ఎకరాలకు పెరిగింది.
ఐటీ ఉద్యోగాల్లో మేటి
తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో ఐటీరంగం ముఖచిత్రమే మారిపోయింది. ప్రభుత్వ సమర్థ కార్యాచరణతో ఐటీ ఉద్యోగావకాశాలు 24౩ శాతం వృద్ధిచెందాయి. 2014లో ఐటీ ఉద్యోగుల సంఖ్య 3,71,774గా ఉంటే 2023 వరకు 9,05,715కు అంటే మూడు రెట్లు పెరిగింది.
మెడికల్ కాలేజీలు 5 రెట్లు
తెలంగాణ ఏర్పడే నాటికి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. దీంతో సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొత్తంగా తొమ్మిదేండ్లలో 21 మెడికల్ కాలేజీల ప్రారంభంతో వీటి సంఖ్య 26కు చేరింది.
ఏడాదికి 10 వేల మంది ఎంబీబీఎస్లు
ప్రభుత్వ, ప్రైవేటు కలిపితే 2014కు ముందు తెలంగాణలో 20 మెడికల్ కాలేజీలు, 2,850 సీట్లు మాత్రమే ఉండేవి. ఈ ఏడాది ఆ సంఖ్య 56కు పెరిగింది. సీట్ల సంఖ్య 8,340కి చేరింది. వచ్చే ఏడాది రానున్న సీట్లు కలుపుకొంటే తెలంగాణ నుంచి ఏడాదికి సగటున 10 వేలమంది డాక్టర్లు తయారు కానున్నారు.
సాగునీరు పుష్కలం.. ఎవుసం సంబురం
తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ జలమాగాణం అయ్యింది. 2014 వరకు కేవలం 62 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందగా.. 126 శాతం పెరుగుదలతో 2023 నాటికి 1.4 కోట్ల ఎకరాలకు నీళ్లందిస్తున్న రాష్ట్రంగా రికార్డు సృష్టించింది.
అంధకారం నుంచి వెలుగు జిలుగులు
ప్రత్యేక రాష్ట్రం వచ్చిన ఆరంటే ఆరు నెలల్లోనే గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటల నిరంతరాయ నాణ్యమైన విద్యుత్తును అందించి దేశమే ఆశ్చర్యపోయేలా చేసింది కేసీఆర్ సర్కారు. 2014లో 1,196 యూనిట్లుగా ఉన్న తలసరి విద్యుత్తు వినియోగం 2023 నాటికి 2,166 యూనిట్లకు చేరింది.
ఆదర్శ గురుకులాలు
తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న గురుకుల విద్య ఇప్పుడు దేశానికే రోల్మాడల్గా మారింది. ఉన్నతవిద్యలో తెలంగాణలో పనితీరు మెరుగ్గా ఉన్నది. 2014లో కేవలం 298 గురుకులాలు మాత్రమే ఉండగా.. 2023 నాటికి ఆ సంఖ్య 1,002కు చేరుకొన్నది.
తెలంగాణ దేశానికే బువ్వగిన్నె
తినడానికి సరిపడా పంట పండితే చాలు అనుకొన్న తెలంగాణ.. ఇప్పుడు దేశానికి అన్నంపెట్టే స్థాయిలో ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నది. 2014లో రాష్ట్రంలో 68 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా ప్రస్తుతం ఇది 2.6 కోట్ల టన్నులకు చేరింది. దేశవ్యాప్తంగా చూస్తే రాష్ట్ర వాటా 14 శాతానికి చేరింది.
స్థాపిత విద్యుత్తు సామర్థ్యం డబుల్
తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 7,778 మెగావాట్లు మాత్రమే. గడిచిన తొమ్మిదేండ్లలో 141 శాతం పెరిగి 18,756 మెగావాట్లకు చేరింది. తొమ్మిదిన్నరేండ్లలో రెట్టింపు కన్నా ఎక్కువ స్థాపిత విద్యుత్తు సామర్థ్యంతో దేశానికే వెలుగుదివ్వెలా మారింది.
– కడవేర్గు రాజశేఖర్