Saleshwaram | లింగాల, ఏప్రిల్ 6 : నల్లమలలోని సలేశ్వరం జాతరలో గురువారం అపశ్రుతి చోటుచేసుకున్నది. రెండో రోజు లక్షకుపైగా భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట ( stampede ) జరిగి ఊపిరాడక ఒకరు, గుండెపోటుతో మరొకరు మృతిచెందారు. నాగర్కర్నూల్ జిల్లా వనపట్లకు చెందిన కుర్వ రాములుతో కలిసి గొడుగు చంద్రయ్య(50) సలేశ్వరంలోని లింగమయ్య దర్శనానికి వెళ్లాడు.
గురువారం తెల్లవారుజామున రాయిపై నుంచి జారిపడుతున్న సమయంలోనే గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల సహకారంతో అక్కడి నుంచి మృతదేహాన్ని అచ్చంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. అలాగే రంగారెడ్డి జిల్లా ఆమనగల్కు చెందిన విజయ(40) లోయలో దర్శనానికి వెళ్లే క్రమంలో భక్తుల రద్దీ మధ్య ఊపిరాడక మృతి చెందింది. మరికొందరికి గాయాలైనట్టు సమాచారం.