హైదరాబాద్, దేవరుప్పుల : అటు దేశంలో , ఇటు రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్తో ఒరిగేదేమీ లేదని, భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదే నని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం, దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రెడ్డి రాజుల నరసయ్య, రెడ్డి రాజుల సోమయ్య తదితరులు హైదరాబాదులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్(BRS)లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్(Congress) పార్టీ అత్యంత దయనీయ స్థితిలో ఉందని, బీజేపీ(Bjp) పెద్దగా లేదని అన్నారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయిందని, అందుకే ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కడుతున్నారని వెల్లడించారు. కొత్తగా పార్టీలో చేరే వారికి సముచిత స్థానం కల్పిస్తూ వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ దేవరుప్పుల మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.