(స్పెషల్ టాస్క్ బ్యూరో ) హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): గిరిజన పారిశ్రామిక వేత్తలను ఆదుకుంటామంటూ రెండేండ్ల కింద ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రాయితీతో కూడిన వెంచర్ క్యాపిటల్ ఫండ్ (విసీఎఫ్-ఎస్టీ) పథకం అమలుకు నోచుకోలేదు. ఈ పథకం కోసం 2022-23 బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించినా తర్వాత రూ.20 కోట్లకు సవరించారు. 2023-24 బడ్జెట్లో రూ.30 కోట్లు కేటాయించినా ఆ పథకం కాగితాలకే పరిమితమైంది. కొవిడ్ మహమ్మారితో నష్టపోయిన గిరిజన పారిశ్రామిక వేత్తలను ఈ పథకం ద్వారా ఆదుకుంటామని బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేసుకున్నది. రాయితీ కూడిన వడ్డీ రేటుతో కనీసం రూ.50 లక్షల నుండి రూ.1 కోటి వరకు ఈ పథకం కింద గిరిజనుల స్టార్టప్లకు, పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి అమలును మరిచిపోయింది. ఎన్నికల సమయంలో ఈశాన్య రాష్ర్టాల్లో ఓట్లు దండుకోవడానికే ఈ పథకం తెచ్చి ఇప్పుడు అమలు చేయడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఆర్థిక సహాయం అవసరం
కరోనా సంక్షోభంతో అతలాకుతలమైన పారిశ్రామిక రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. ఆర్థిక వనరులు లేక గిరిజన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కనీసం ఇప్పటికైనా వీసీఎఫ్-ఎస్టీ పథకం కింద నిధులు విడుదల చేసి వారిని ఆదుకోవాలి.
– మిలింద్ కాంబ్లే, వ్యవస్థాపక అధ్యక్షుడు, దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ.