హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని, డిస్కంలను ప్రైవేటీకరించబోమని తెలంగాణ ప్రభుత్వం మరోసారి కేంద్రానికి స్పష్టం చేయనుంది. విద్యుత్తుపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ కమిటీ ముందు తెలంగాణ ప్రభుత్వం తరఫున గళాన్ని విప్పి.. అభిప్రాయాన్ని చెప్పేందుకు ఉన్నతాధికారుల బృందం ఢిల్లీకి చేరుకుంది. రాష్ట్ర విద్యుత్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావుల నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం గురువారం ఉదయం పార్లమెంటరీ కమిటీ ముందు తమ అభిప్రాయాన్ని వినిపించనుంది. ఈ బృందంలో ఇంకా ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, జేఎండీ శ్రీనివాసరావు తదితరులున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్తు చట్టం-2003కు పలు సవరణలు చేస్తూ.. సిద్ధం చేసిన విద్యుత్తు సవరణల బిల్లు-2022ను చాలా రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నాయి. మొదటి నుంచి ఈ బిల్లును తెలంగాణ కూడా వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర శాసనసభలోనూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడం, డిస్కంలను ప్రైవేటీకరించడం, క్రాస్ సబ్సిడీని ఎత్తివేయడం.. లాంటి అనేక వివాదాస్పద, ప్రజా వ్యతిరేక అంశాలతో కూడిన విద్యుత్తు సవరణల బిల్లు-2022ను మొదటి నుంచి సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది. ఇందుకు సంబంధించి రాతపూర్వక అభిప్రాయాన్ని ప్రభుత్వం ఇప్పటికే పార్లమెంటరీ కమిటీకి పంపినట్టు సమాచారం. విద్యుత్తు సవరణల బిల్లు-2022పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడం, విద్యుత్తు సంస్థల కార్మికులు, ఉద్యోగులు, ఇంజినీర్లు సమ్మెకు దిగడం, నిరసనలు వెల్లువెత్తడంతో.. బిల్లును పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటరీ కమిటీ అన్ని రాష్ర్టాల అభిప్రాయాలను సేకరిస్తున్నది. గురువారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలను అభిప్రాయాలను తెలపాల్సిందిగా ఆహ్వానించింది.