హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): మోకిలలో హెచ్ఎండీఏ ప్లాట్ల విక్రయానికి మంచి డిమాండ్ నెలకొన్నది. రెండో దశలో నాలుగో రోజు విక్రయానికి ఉంచిన 60 ప్లాట్లను కొనుగోలుదారులు ఆన్లైన్లో పోటీపడి మరీ కొనుగోలు చేశారు. చదరపు గజానికి గరిష్ఠంగా రూ.66 వేలు, కనిష్ఠంగా రూ.49 వేలు రాగా, సగటున రూ.56 వేలు పలికిందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. తొలి మూడు రోజుల్లో లేఅవుట్ ముందు వరసలోని ప్లాట్లకు గజం ధర రూ.70వేల నుంచి 1.05 లక్షలు పలికితే, లోపలికి ఉన్న పాట్లకు రూ.66 వేల దాకా పలికిందని పేర్కొన్నారు.
మోకిలలో హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్న భారీ వెంచర్లో మొదటి దశలో 50 ప్లాట్లను విక్రయించగా, రెండో దశలో 300 ప్లాట్లను విక్రయించేందుకు ఆన్లైన్ వేలం వేస్తున్నారు. కేంద్ర సంస్థ ఎంఎస్టీసీ ఆధ్వర్యంలో ఆన్లైన్ వేలాన్ని నిర్వహిస్తున్నారు. సోమవారం విక్రయానికి ఉంచిన 60 ప్లాట్లకు నిర్ణయించిన అప్సెట్ విలువ రూ.46.50 కోట్లు కాగా, వేలంలో రూ.105.16 కోట్లు వచ్చాయని వివరించారు.