BRS | హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): రాజకీయ నేపథ్యం లేనివాళ్లెందరినో ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దారు. ఊహకందని ఎంతోమందిని లోక్సభకు పంపారు. తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన కొందరు నాయకులకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చి గెలిపించారు. 2014 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ కొందరు కొత్తవారికి సీఎం కేసీఆర్ అవకాశం కల్పిస్తున్నారు. సోమవారం బీఆర్ఎస్ ప్రకటించిన తొలి జాబితాలో ఏడుగురు కొత్తవారికి అవకాశమిచ్చారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితులు, భవిష్యత్తు, అభివృద్ధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని వారికి టికెట్లు కేటాయించారు.
మావోయిస్టు అగ్రనేతల బిడ్డ నాగజ్యోతి
ములుగు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బడే నాగజ్యోతిని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ అగ్ర నేతలైన బడే నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకరన్న, బడే రాజేశ్వరి అలియాస్ నిర్మలక కుమార్తె నాగజ్యోతి. 29 ఏండ్ల చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే బడే నాగజ్యోతి కన్నీటి పర్యంతమయ్యారు.
దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఇటీవలే మరణించిన దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందితకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నందిత.. సాయన్న బాటలోనే ప్రజాసేవలో ఉన్నారు. లాస్య నందిత 2016లో కవాడిగూడ నుంచి కార్పొరేటర్గా సేవలందించారు. అప్పటి నుంచి తండ్రికి తోడుగా ప్రజాసేవ చేస్తున్నారు.
వైద్యుడు కల్వకుంట్ల సంజయ్కుమార్
జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు వయోభారంతో బాధ పడుతున్నారు. ఈ సారి తన కుమారుడికి అవకాశమివ్వాలని సీఎం కేసీఆర్ను కోరారు. దాంతో యశోద దవాఖానలో వైద్యుడిగా సేవలందిస్తున్న కల్వకుంట్ల సంజయ్కుమార్కు ఈ సారి కోరుట్ల నుంచి బరిలో నిలిచే అవకాశం కల్పించారు కేసీఆర్.
భూక్య జాన్సన్ రాథోడ్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్కు కూడా సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. జాన్సన్ రాథోడ్ నాయక్.. తండాలో జన్మించి ఖండాంతరాలు దాటి అమెరికా వెళ్లారు. అక్కడ కొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. పుట్టిన గడ్డకు సేవచేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఆయనకు కేసీఆర్ ఖానాపూర్ టికెట్ కేటాయించారు.
కార్వాన్ నియోజకవర్గం నుంచి ఈ సారి ఐందల కృష్ణయ్య (మిత్రకృష్ణ)కు అవకాశమిచ్చారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రులైన కృష్ణ జియాగూడ కార్పొరేటర్గా గతంలో సేవలందించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి తొలిసారిగా అసెంబ్లీ బరిలో దిగబోతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. మలక్పేట నియోజకవర్గం నుంచి తీగల అజిత్రెడ్డికి అవకాశమిచ్చారు. అజిత్రెడ్డి భార్య సునరితారెడ్డి గతంలో ముసారంబాగ్ కార్పొరేటర్గా సేవలు అందించారు. ప్రతిసారి కొంతమంది కొత్తవాళ్లను అవకాశమిస్తున్న సీఎం కేసీఆర్.. ఈ సారి కూడా ఏడుగురికి సీట్లు కేటాయించారు. దాంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.