హుజూరాబాద్/ సూర్యాపేట(నమస్తే తెలంగాణ) / మహబూబ్నగర్ అర్బన్, జనవరి 31 : మున్సిపల్ ఎన్నికల వేళ అధికార పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్టు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో వీరన్నపేటకు చెందిన కాంగ్రెస్ నేత కుర్వ సత్యం ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో 48వార్డు నుంచి బొమ్మిడి అశోక్, చెనగాని అంజమ్మ, సల్మా మస్తాన్, కాల రామ్, దొండ శ్రీను, మేకల వెంకన్న, నిరంజన్, షేక్ యాకూబ్పాషా ఆధ్వర్యంలో 150 మంది బీఆర్ఎస్లో చేరారు. 26వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు, పెద్దగట్టు మాజీ చైర్మన్ కోడి సైదులు యాదవ్ 40 మంది నాయకులు, కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్లో చేరారు.
వారందరికీ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హుజూరాబాద్ మున్సిపల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ తరఫున ఏడో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న గన్నారపు రాజు, ఉమ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.