హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): మక్కరైతు నోట్లో కేంద్రప్రభుత్వం మట్టి కొట్టేలా కనిపిస్తున్నది. నోటికాడ బుక్క లాగేసుకొనే చర్యలకు దిగుతున్నది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మక్కలకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉన్నది. దీంతో కాస్తోకూస్తో లాభాలు వస్తాయని మక్కరైతులు అనుకొనేలోపే కేంద్రంలోని బీజేపీ సర్కారు, రైతులపై నిప్పులు పోసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. డిమాండ్ బాగా ఉండటంతో విదేశాలకు మక్కల ఎగుమతులు పెరిగాయి. దీంతో ప్రస్తుతం మక్క క్వింటాలుకు రూ. 2,200 నుంచి రూ.2,400 వరకు పలుకుతున్నది. ఇలాంటి సమయంలో ఎగుమతులను నిషేధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టు తెలిసింది.
ఇదే జరిగితే మక్కల ధర పడిపోయి రైతుకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. రైతులకు మేలు జరిగే సమయంలో ఎగుమతులను నిషేధించాలన్న ఆలోచన సరైంది కాదని రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు. రైతులను కొట్టి కార్పొరేట్ సంస్థలకు దోచి పెట్టేందుకే కేంద్రం ఇలాంటి చర్యలకు దిగుతున్నదని ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మక్కలకు మద్ధతు ధర క్వింటాలుకు రూ.1,962 గా ఉన్నది. మార్కెట్లో డిమాండ్ పెరగటంతో నేపథ్యంలో క్వింటాలుకు రూ.2400 వరకు వస్తున్నది. మొక్కజొన్నలను పౌల్ట్రీ, స్టార్చ్ ఇండస్ట్రీలో అధికంగా వినియోగిస్తారు. ఈ రెండు రంగాల నుంచి భారీగా డిమాండ్ పెరగటంతో మక్కలకు ధర పెరిగినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
అప్పుడలా… ఇప్పుడిలా
సరిగ్గా రెండేళ్ల క్రితం కూడా మక్క రైతులకు కేంద్రం తీవ్ర నష్టం చేసింది. 2020లో దేశంలో మక్కల ఉత్పత్తి పెరిగి ధర భారీగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎగుమతులను ప్రోత్సహించి రైతులకు ధర వచ్చేలా చేయాల్సిన కేంద్రం, అం దుకు విరుద్ధంగా విదేశాల నుంచి దిగుమతులను ప్రోత్సహించింది. అది కూడా దిగుమతి సుంకాన్ని 50 శాతం తగ్గించి మరీ ప్రోత్సహించడం గమనా ర్హం. దీంతో అసలే డిమాండ్ లేక దిక్కుతోచని స్థితి లో ఉన్న రైతులు మరింత చితికిపోయారు. ఇప్పుడేమో భారీ డిమాండ్ కారణంగా ధర పెరిగింది. ఇలాంటి సమయంలో ఎగుమతులను ప్రోత్సహిస్తే రైతులకు మరింత ధర దక్కే అవకాశం ఉన్నది. కానీ కేంద్రం మాత్రం రైతులకు మంచి ధర దక్కకుండా చేసేందుకు ఎగుమతులపై నిషేదం విధించే ఆలోచన చేస్తుండటం గమనార్హం.