Deputation | హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖలో ఓ వైద్యురాలికి ఇచ్చిన డిప్యుటేషన్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైద్యశాఖలో అన్ని రకాల డిప్యుటేషన్, వర్ఆర్డర్స్ను రద్దు చేస్తూ ఈ నెల 7న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 8వ తేదీ సాయంత్రానికి తిరిగి తమ సొంత పోస్టింగ్కు వెళ్లి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయంతో దాదాపు 2 వేల మంది గురువారం సొంత ప్రాంతాల్లో తిరిగి రిపోర్టు చేశారని తెలిసింది. ఖమ్మం జిల్లా నుంచి డిప్యుటేషన్పై హైదరాబాద్లో పనిచేస్తున్న ఓ ఎంటమాలజిస్టుకు మాత్రం ఈ ఉత్తర్వులు అమలు కాలేదు. ఆమె ఖమ్మం వెళ్లలేదు.. రిపోర్ట్ చేయలేదు.
హైదరాబాద్లోనే ఉన్నారు. డిప్యుటేషన్లు రద్దు చేసిన రోజే ఆగమేఘాల మీద ‘ఫారిన్ సర్వీస్ డిప్యుటేషన్’ (ఎఫ్ఎస్డీ) తయారై గంటల్లోనే ఆమె వద్దకు చేరింది. దీంతో ఆమె జీహెచ్ఎంసీలోనే ఉండిపోయారు. దీంతో వైద్యవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. వాస్తవానికి ఎఫ్ఎస్డీ కావాలంటే సిబ్బంది ముందుగా సంబంధిత విభాగాధిపతికి వ్యక్తిగతంగా దరఖాస్తు చేయాలి. దానిని పరిశీలించిన తర్వాత ఎఫ్ఎస్డీ కన్సెంట్ ఇస్తారు. దాని ప్రకారం హెచ్వోడీ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఎఫ్ఎస్డీ ఆర్డర్ రావడానికి సాధారణంగా 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. కానీ, ఈ వైద్యురాలి విషయంలో కొన్ని గంటల్లోనే ఎఫ్ఎస్డీ ఆర్డర్ ఎలా ఇచ్చారని వైద్యవర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఆమె ఎప్పుడు డీపీహెచ్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు? సంబంధిత హెచ్వోడీకి ఎప్పుడు పంపారు? కన్సెంట్ ఎప్పుడు ఇచ్చారు? వంటి వివరాలన్నీ వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.
డిప్యుటేషన్లు, వర్క్ ఆర్డర్లను ప్రభు త్వం రద్దు చేయడాన్ని కొందరు హెచ్వోడీలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. వాస్తవానికి హెచ్వోడీలు తమ విచక్షణ మేరకు తాత్కాలికంగా కొందరు ఉద్యోగులను డిప్యుటేషన్పై ఇతర దవాఖానలు, ఆఫీసులకు పంపుతుంటారు. మరికొందరిని ప్రభుత్వమే ఫలానా చోట వారి సేవలు అవసరమని గుర్తించి, డిప్యుటేషన్పై పంపుతుంది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేస్తుంది. డిప్యుటేషన్ల రద్దు నిర్ణయం వీరికి వర్తించదు. అయినా టీవీవీపీ, డీఎంఈ కార్యాలయాల్లో జీవోపై పనిచేస్తున్న కొందరు ఉద్యోగులను తిరిగి సొంత ప్రాంతాలకు పంపినట్టు తెలిసింది. తమకు అడ్డు వస్తారనే భావనతోనే వారిని పక్కకు తప్పించినట్టు చర్చ జరుగుతున్నది.