హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): వరుసపెట్టి పేపర్ లీకేజీ కుట్రలకు పాల్పడుతూ ఆ నేరం ప్రభుత్వానిదేనని వేలెత్తి చూపుతున్న తొండి సంజయ్.. మిగిలిన నాలుగు వేళ్లు తన వైపే చూపుతున్న సంగతి గమనించటం లేదు. అధికార దాహంతో లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యంతో ఆడుకుంటున్న బండి సంజయ్ని తక్షణమే అరెస్టు చేయాలన్న డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా బలంగా వినిపిస్తున్నది. విద్యార్థి, ఉద్యోగ సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్నది.
పేపర్ లీకేజీ వ్యవహారంలో పాత్రధారుల కన్నా సూత్రధారులను కఠినంగా శిక్షించాల్సిన అవసరమున్నదన్న డిమాండ్ పెరుగుతున్నది. లక్షల మంది విద్యార్థులు, యువత జీవితాలతో ఆడుకొంటున్నవారిపై క్రిమినల్ కేసులు పెట్టడం, ఉద్యోగం నుంచి తొలగించటం వంటి చిన్న శిక్షలు సరిపోవని విద్యారంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ ఇప్పటికే.. ఎనిమిది నెలల పాటు చదువులు పక్కన పెట్టండి, బీజేపీ కోసం పనిచేయండి అని పిలుపునివ్వటాన్ని ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుంటే.. బీజేపీకి కార్యకర్తలను దూరం చేసేందుకే నోటిఫికేషన్లు ఇస్తున్నారు అంటూ బండి సంజయ్ విద్వేషాన్ని వెళ్లగక్కారు. ఈ కామెంట్లను బట్టి చూస్తే పేపర్ లీకేజీలకు సూత్రధారి ఆయనే అన్న సంగతి స్పష్టమవుతున్నదని మేధావులు, విద్యార్థులు అంటున్నారు.
తొమ్మిదేండ్లుగా సజావుగా సాగిన పరీక్షల వ్యవహారం ఎన్నికల వేళ గాడి ఎలా తప్పుతుందని, దీని వెనుక భారీ కుట్ర ఉన్నదని బలంగా విశ్వసిస్తున్నారు. మొన్నటికి మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంటూ బండి సంజయ్ నానా హంగామా చేశారు. ఆ లీకువీరులు బీజేపీ సన్నిహితులేనని బయట పడింది. తాజాగా వరుసగా రెండో రోజు పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ అయ్యిందంటూ దుష్ప్రచారానికి తెరలేపారు. ఇందులో కూడా దోషులకు బీజేపీతో లింకులున్నట్టు ఆధారాలతో సహా బయటపడింది. ఇంతకన్నా రుజువులు ఏం కావాలి? అంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అధికారం కోసం ఇలాంటి చవకబారు రాజకీయాలకు దిగి విద్యార్థుల బతుకు ఆగమాగం చేస్తున్న వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరుతున్నారు.
తెలంగాణలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం అనేక సందేహాలను కలిగిస్తున్నది. పదో తరగతి వార్షిక పరీక్షల పేపర్లు వాట్సాప్లలో రావడం అంటే కొంతమంది కుట్రగా కనిపిస్తున్నది. ఉద్దేశ పూర్వకంగానే ప్రశ్నపత్రాలు లీక్ చేసేందుకు ప్రయత్నించినట్టుగా అనుమానాలు ఉన్నాయి. పోలీసులు పకడ్బందీగా విచారణ చేసి, ఈ కుట్రను ఛేదించాలి. పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలి. పేపర్ బండి సంజయ్ వరకు వెళ్లిందంటే ఇది ముమ్మాటికీ కుట్రే.
– ఎం చెన్నయ్య, పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు
రాజకీయ స్వార్థం కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదు. రాజకీయ పార్టీలు అంటే ప్రజల బాగోగుల కోసం పనిచేయాలి. అంతేతప్ప ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఆలోచనతో ప్రశ్నపత్రాలు లీకేజీ చేయాలనుకోవడం దారుణం. ఇటువంటి రాజకీయ ఆటలతో విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారిపోయే ప్రమాదమున్నది. టీచర్లు సంయమనం పాటించాలి. రాజకీయ కుట్రలకు బలికావద్దు.
– బీరెల్లి కమాలకర్ రావు, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం చూస్తుంటే.. కొందరు కావాలనే చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఉపాధ్యాయులను, అధికారులను, ప్రభుత్వాన్ని అపహాస్యం చేయడానికే, విద్యాశాఖ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తున్నది. పిల్లలు మానసికంగా ఆందోళనకు గురికావద్దు. ధైర్యంగా పరీక్షలు రాయాలి.
– సదానంద్ గౌడ్, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రశ్నపత్రాలు లీకేజీ చేయాలనుకోవడం మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం ఎంత నిబద్ధతగా పనిచేసినప్పటికీ.. వ్యవస్థలో ఇటువంటి తప్పులు చేసే ఒకరిద్దరి వల్ల విద్యార్థులు నష్టపోవాల్సి వస్తున్నది. ప్రభుత్వం ఇటువంటి వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి. మరోసారి ఎవరైనా తప్పుచేయాలంటేనే భయపడేలా సంస్కరణలు తీసుకురావాలి.
– సీ జగదీశ్, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడు
పేపర్ల లీకేజీల వెనుక బీజేపీ నేతల హస్తం ఉన్నది. దేశంలోనే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి బీజేపీ అగ్ర నాయకత్వం కుట్రలకు తెరలేపింది. ఈ లీకేజీలతో ఆ అనుమానాలు బలపడుతున్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీలో ఉన్న వ్యక్తికి బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎలాగైనా అధికారాన్ని దక్కింంచుకోవాలనే ఆశతో బీజేపీ లక్షలాది మంది జీవితాలతో ఆడుకుంటున్నది. ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారు.
– అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
పేపర్ లీకేజీ ప్రధాన సూత్రధారుడు బండి సంజయ్ను అరెస్టు చేయాలి. పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడైన బీజేపీ కార్యకర్త.. బండికి అత్యంత సన్నిహితుడని తేలింది. దొంగే దొంగా దొంగా అని అరిచినిట్టు ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని బండి కంకణం కట్టుకున్నాడనే విషయం స్పష్టమైంది. లక్షలాది మంది విద్యార్థులతో రాజకీయ చెలగాటం ఆడుతున్న బండి సంజయ్ను అరెస్టు చేసి, సమగ్ర దర్యాప్తు చేయాలి.
– సతీశ్రెడ్డి, రెడ్కో చైర్మన్
రాష్ట్రంలో పరీక్షల లీకేజీ వ్యవహారంలో బీజేపీ కుట్ర కోణం బట్టబయలైంది. కమలాపూర్లో బీజేపీ కార్యకర్త ప్రశాంత్ బయటకు తెచ్చిన పదోతరగతి హిందీ ప్రశ్నాపత్రాన్ని బండి సంజయ్కు వాట్సాప్ ద్వారా పంపించారు. బాధ్యతగల ఎంపీగా ఉండి ఆ సమాచారాన్ని బండి సంజయ్ పోలీసులకు ఇవ్వకపోవడం నేరమే. రాహుల్ తరహాలో లోక్సభ స్పీకర్ బండి సంజయ్పై కూడా అనర్హత వేటు వేయాలి. బీజేపీ కుట్రలను బహిర్గతం చేసేందుకు పోలీసులు మరింతలోతుగా దర్యాప్తు చేయాలి.
– ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి