నర్సంపేట, మార్చి 26 : ‘మన బస్తీ-మన బడి’కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు ఈ బస్తీబడి వరంలా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన బస్తీ-మన బడి’లో పాఠశాలలకు సౌకర్యాలను కల్పిస్తున్నది. వరంగల్ నర్సంపేటలోని హనుమాన్ దేవల్ పాఠశాల నూతన హంగులను సంతరించుకున్నది. ఇంగ్లిష్ మీడియం బోధించే ఈ పాఠశాలకు నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట మండలాల నుంచి కూడా పిల్లలు ఆటోల్లో వస్తుండటంతో 376 మందితో కళకళలాడుతున్నది.
విద్యార్థుల నుంచి వచ్చే పోటీని తట్టుకోలేక ప్రతి తరగతిలోనూ ఏ, బీ సెక్షన్లు చేయాల్సి వచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభానికి ముందే ఈ పాఠశాలలో విద్యార్థులకు ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఇక్కడ ప్రవేశాలు దొరకాలంటే పోటీపడక తప్పడంలేదు. ఇక్కడ 11 మంది ఉపాధ్యాయులు కార్పొరేట్కు దీటుగా విద్యాబోధన చేస్తున్నారు. అలాగే విద్యార్థుల కోసం సకల సౌకర్యాలు కల్పించారు. స్కూల్ యూనిఫారం, తరగతి గదుల్లో ఫ్యాన్లు, 183 డ్యుయల్ డెస్క్లు, ఎనిమిది గ్రీన్ బోర్డులు సమకూరాయి. మధ్యాహ్న భోజనం అందించేందుకు వీలుగా కిచెన్ షెడ్డు నిర్మించారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. కరెంటు పోయినా అసౌకర్యం కలుగకుండా సోలార్ సిస్టం అమర్చారు. ప్రతి తరగతి గది గోడలపై ఆకట్టుకునేలా బొమ్మలు వేయించారు. సకల వసతులు కల్పించడంతో ఈ పాఠశాలలో అడ్మిషన్ దొరకడం కష్టంగా మారింది.