Kaleshwaram | రాష్ట్ర నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో కేంద్ర బృందం భేటీ ముగిసింది. సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజినీర్ అనిల్ జైన్ నేతృత్వంలో కేంద్ర బృందం సమావేశం కాగా, ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండే, ఎల్ అండ్ టీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మేడిగడ్డ ఆనకట్ట కుంగిన వ్యవహారంపై ఇంజినీర్లు సమీక్షించారు. ఆనకట్టకు సంబంధించిన సాంకేతిక అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు లేవు అని స్పష్టం చేశారు. ఏడో బ్లాక్లో సమస్య రావడం వల్ల సెంటర్ పియర్ కుంగిందని తెలిపారు. ఎక్కడో చిన్న పొరపాటు అయితే జరిగింది. ఇసుక వల్ల సమస్య వచ్చిందని అనుకుంటున్నాం. క్వాలిటీ ఆఫ్ సాండ్, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్పై అనుమతులు ఉన్నాయి. కాపర్ డ్యామ్కు వరద తగ్గిన తర్వాత నవంబర్లో సమగ్ర పరిశీలన చేపడుతామని మురళీధర్ పేర్కొన్నారు.
మేడిగడ్డ బరాజ్లోని పిల్లర్ కుంగుబాటు వల్ల కాళేశ్వరం ఆయకట్టుకు ఎలాంటి ఢోకా లేదని, యథావిధిగా సాగునీటిని అందించే అవకాశం ఉన్నదని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్న విషయం తెలిసిందే.