హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): అఖిల భారత పద్మశాలీ సంఘం చేపట్టిన బున్కర్ ఏక్తా యాత్రకు సూరత్ జరీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నాయకులు మద్దతు ప్రకటించారు. చేనేతపై జీరో జీఎస్టీ కోసం పద్మశాలీ సంఘం దేశవ్యాప్తంగా వివిధ సంఘాలు, పార్టీ నేతల మద్దతును కూడగుతున్నది. గుజరాత్లో పర్యటిస్తున్న ఆ బృందం సూరత్ జరీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నాయకులతో సోమవారం భేటీ అయ్యింది. జీరో జీఎస్టీ ఉద్యమం గురించి వివరించింది.
ఈ సందర్భంగా సూరత్ జరీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ చంద్ర హెచ్ జరివాలా మాట్లాడుతూ.. గతంలో రియల్ జరీ, ఇమిటేషన్ జరీలపై 12 శాతంగా జీఎస్టీ విధించాలని కేంద్రం నిర్ణయించిందని, ఐక్య పోరాటం ద్వారా తాము తిప్పికొట్టామని గుర్తుచేశారు. ఫలితంగా 12 శాతం నుంచి 5 శాతానికి జీఎఎస్టీని కుదించిందని చెప్పారు.
జీరో జీఎస్టీ కోసం సాగిస్తున్న ఉద్యమానికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో అఖిల భారత పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్ననేత, నటి, సామాజిక కార్యకర్త పూనమ్కౌర్, అంకుర్ పాల్గొన్నారు.