హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఇప్పుడు కొత్తగా అడ్మిషన్లు పొందే విద్యార్థుల్లో ఎవరి నోట విన్నా సర్కారు స్కూళ్ల పేర్లే వినిపిస్తున్నాయి. ఇంతకాలం ప్రైవేట్ వెల్లువలో పడిపోయిన వారంతా ఇప్పుడు సర్కారు స్కూళ్ల బాట పడుతున్నారు. నెల రోజుల్లోనే 1,60,755 మంది విద్యార్థులు కొత్తగా సర్కారు స్కూళ్లల్లో చేరారు. వీరిలో అత్యధికులు ఇంగ్లిష్ మీడియంలోనే చేరడం గమనార్హం. ప్రభుత్వ బడుల్లో నమోదును పెంచేందుకు చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట సత్ఫలితాలనిస్తున్నది. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతిష్ఠాత్మకంగా అన్ని బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం సైతం ఇందుకు దోహదపడుతున్నది. కొత్తగా చేరుతున్న వారంతా ఇంగ్లిష్ మీడియాన్నే ఏరికోరి ఎంచుకొంటున్నారు. ఈ నెల 30తో బడిబాట కార్యక్రమం ముగియనున్నది. ఆ తర్వాత అడ్మిషన్లు జరుపుతామని అధికారులంటున్నారు.
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలోనూ గతంలో ఎన్నడు లేనంతగా అడ్మిషన్ల తాకిడి మొదలయ్యింది. 6వ తరగతి అడ్మిషన్ల కోసం ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలు ఇస్తున్నారు. ఎస్సెస్సీ వరకు 200 మంది, ఇంటర్ వరకు 360 మంది సామర్థ్యంతో కేజీబీవీలను నిర్వహిస్తుండగా, డిమాండ్తో పలు కేజీబీవీల్లో సీట్ల సంఖ్యను పెంచారు. రెసిడెన్షియల్ పాఠశాలలు కావడంతో విద్యార్థులకు వసతి సమస్య తలెత్తనుండటంతో అడ్మిషన్లు తీసుకోలేమని అధికారులు అంటున్నారు. కేజీబీవీల్లో సైతం ఉచిత విద్యనందిస్తుండటం, వీటిల్లోని విద్యార్థులంతా ఆటలు, క్రీడలు, చదువుల్లో రాణిస్తుండటంతో వీటిల్లో చేరేందుకు అమ్మాయిలు ఇష్టపడుతున్నారు.
ఉపాధ్యాయులు లేక మూతబడ్డ ఆ బడి పదమూడేండ్ల తర్వాత బుధవారం 13 మంది విద్యార్థులతో పునఃప్రారంభమైంది. ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా మంగపేట మండలం నర్సింహసాగర్ పంచాయతీ పరిధిలోని మారుమూల గ్రామం గొందిగూడెంలోని ప్రాథమిక పాఠశాల టీచర్ల కొరతతో పదమూడేండ్ల క్రితం మూతపడింది. అప్పటినుంచి ఆ గ్రామంలోని విద్యార్థులు 2 కిలోమీటర్లు నడిచి నర్సింహసాగర్ ప్రాథమిక పాఠశాలకు వెళ్తున్నారు. ఇటీవల మంగపేట మండలానికి ఉపాధ్యాయులు బదిలీపై రావడంతో ఇక్కడ ఓ టీచర్ను నియమించారు. దీంతో మూతపడ్డ పాఠశాలను తిరిగి 13 మంది విద్యార్థులతో ప్రారంభించినట్టు ఎంఈవో రాజేశ్కుమార్ తెలిపారు. బడి పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
అడ్మిషన్ల తాకిడికి పలు పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు పెట్టాల్సి వస్తున్నది. సిద్దిపేట ఇందిరానగర్ పాఠశాలలో ఇటీవల దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చిన వారి సందడి జాతరను తలపించింది. ఇక హైదరాబాద్లోని బోరబండలోని నాట్కో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల తాకిడి తట్టుకోలేక గేట్స్ మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇలా రాష్ట్రంలోని 200 బడుల్లో అడ్మిషన్లకు తీవ్రమైన పోటీ ఉంది. ప్రభుత్వ బడుల్లో ఉచితంగా మధ్యాహ్న భోజనం పెడుతుండటం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలను అందజేస్తుండటం, తాజాగా ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టడంతో విద్యార్థులంతా సర్కారు స్కూళ్లనే ఎంచుకుంటున్నారు.
మేడ్చల్ 15,268
సంగారెడ్డి 9,759
ఖమ్మం 9,203
రంగారెడ్డి 8,450
కొత్తగూడెం 8,432
హైదరాబాద్ 8,427
సిద్దిపేట 7,056
మెదక్ 6,554