Rahul Gandhi | హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): యూత్ డిక్లరేషన్, ఉద్యోగ క్యాలండర్ పేరుతో హడావిడి చేస్తున్న కాంగ్రెస్ అసలు రూపం బట్టబయలైంది. ఆ పార్టీ కపట ప్రేమ కండ్ల ముందే కనిపిస్తున్నది. యువతను ఆకట్టుకునేందుకు జూన్ 18న రాజీవ్గాంధీ యూత్ క్విజ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పోటీలను నిర్వహించింది. ప్రతి నియోజకవర్గం నుంచి విద్యార్థులు, యువతను ఎన్రోల్ చేయించింది. విజేతలుగా నిలిచిన వారికి ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు, స్మార్ట్వాచ్లు ఇస్తామని ప్రకటించింది. మహిళా టాపర్లకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని గొప్పగా చెప్పుకొచ్చింది. ఈ క్విజ్ పోస్టర్ను రాహుల్గాంధీ రిలీజ్ చేశారు. అన్ని నియోజకవర్గాల్లో గ్రాండ్గా పరీక్షను నిర్వహించింది. 4 లక్షల మంది యువత పాల్గొన్నారు.
తీరా పరీక్షలు నిర్వహించి ఆర్నెల్లు గడుస్తున్నా ఫలితాలకు అతీగతి లేదు. ఇస్తామన్న బహుమతులకు దిక్కులేదు. దీంతో పరీక్ష రాసినవారు ఫలితాలేవి? బహుమతులేవి? అని స్థానిక నేతలను ప్రశ్నిస్తున్నారు. కొందరైతే సోషల్మీడియా వేదికగా రాహుల్గాంధీనే ప్రశ్నిస్తున్నారు. ‘మీరు రిలీజ్ చేసిన రాజీవ్ యూత్ క్విజ్లో పాల్గొన్నాం. ఫలితాలు ఎప్పుడిస్తారు? ప్రైజ్లు ఎప్పుడిస్తారు?’ అని నిలదీస్తున్నారు. క్విజ్ ఫలితాలు ఇవ్వకపోవడంపై కాంగ్రెస్పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. 4 లక్షల మంది పాల్గొన్న క్విజ్ పోటీల ఫలితాలు వెల్లడించలేని కాంగ్రెస్ .. జాబ్ క్యాలెండర్ అమలు చేసి యువతకు ఉద్యోగాలిస్తానంటే ఎలా నమ్ముతాం? అని ప్రశ్నిస్తున్నారు. యూత్ డిక్లరేషన్, హామీలు కూడా క్విజ్ పోటీ లాంటివేనని, ఆ పార్టీకి ఓటేసి మోసపోం అని స్పష్టం చేస్తున్నారు.