హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): చేనేత కళను విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా ఇండోనేషియా బాలిలో నిర్వహించిన సమావేశం వేదికగా వరల్డ్ వీవర్స్ ఫోరం ఆవిర్భవించింది. ఈ మేరకు అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు, జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న నేత శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఫోరం లోగోను ఇండోనేషియా ఫ్యాషన్ వీక్ వ్యవస్థాపకురాలు పాపి దర్శనో, ఇండోనేషియా ఫ్యాషన్ డిజైనర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు మలైకా, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం అంజయ్య, చింతకింది మల్లేశం, జాతీయ అవార్డు గ్రహీతలు కొలను రవీందర్, గంజి యాదగిరి, లొల్ల వీరవెంకటసత్యనారాయణ, గజం భగవాన్, జాతీయ మెరిట్ సర్టిఫికెట్ గ్రహీతలు చిలుకూరు శ్రీనివాస్, వరదన్లు ఆవిషరించారని వివరించారు.
ప్రపంచ వ్యాప్తంగా చేనేత కళాకారులను ఫోరం పరిధిలోకి తీసుకొచ్చి నేత కళను విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా ఫోరం పని చేస్తుందని, తదుపరి కార్యక్రమాలు వరల్డ్ వీవర్స్ ఫోరం ఆధ్వర్యంలో కొనసాగుతాయని ఆ ప్రకటనలో వెల్లడించారు.