హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించడంలో తెలంగాణ స్వయం సహాయక సంఘాల మహిళలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వాయిదాల ప్రకారం రుణాలు తీర్చేస్తూ బ్యాంకింగ్ వ్యవస్థలో తమ పరపతిని పెంచుకొంటున్నారు. కరోనా కష్ట కాలంలోనూ ఇదే ఒరవడి కొనసాగింది. రుణ వాయిదాలను సకాలంలో చెల్లించి, ఔరా అనిపించారు. కరోనా కాలంలోనూ నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ)లు 2%లోపే ఉండటం విశేషం. కరోనా పూర్వకాలంతో పోల్చుకుంటే కరోనా కాలంలోనూ ఎన్పీఏలలో పెరుగుదల లేకపోవడం గమనార్హం. దీంతో బ్యాంకర్లు మహిళలకు రుణాలు ఇవ్వడానికి ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. ఎలాంటి తనఖా లేకుండానే లక్షల్లో రుణాలు మంజూరుచేస్తున్నారు. నిజానికి కరోనా కాలంలో రెండేండ్లపాటు చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఒకానొక దశలో ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడ్డారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తీసుకున్న పలు చర్యలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా నిలబడింది. దీంతో మహిళా సంఘాల ప్రతినిధులు తాము తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించగలిగారు.
మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాలపై బ్యాంకులు తక్కువ వడ్డీలు వసూలు చేస్తున్నాయి. రూ.3 లక్షల లోపు రుణాలపై 7%, రూ.5 లక్షల వరకు రుణాలకు 8% వడ్డీని మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. దీంతో రూపాయి కంటే తక్కువ వడ్డీకి మహిళలకు రుణాలు లభిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రతి మహిళా సంఘం సభ్యురాలికి ప్రతి మూడేండ్లకు ఒకసారి రుణం లభించే విధంగా గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ అధికారులు ప్రణాళిక రచించారు. మహిళా సంఘాల్లోని 46 లక్షల మందికి కనీసం రూ.2 లక్షల చొప్పున రుణం ఇచ్చినా మూడేండ్లకు రూ.92 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో రుణ లక్ష్యాన్ని గణనీయంగా పెంచాలని భావిస్తున్నారు. ఒక కుటుంబానికి కనీసం నెలకు రూ.10 వేలకుపైగా ఆదాయం రావాలన్నది అధికారుల ఉద్దేశం. ఒక్కొక్కరికి రెండేసి లక్షల వరకు రుణం అందజేస్తే.. వారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి అవకాశం లభిస్తుందని, దీంతో వారి ఆదాయం వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.