హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): సామాజిక న్యాయం కోసం బీఆర్ఎస్ పనిచేస్తుందని, దేశ రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు అందరూ కదలాల్సిన అవసరముందని భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు చెప్పారు. ప్రజల అవసరాలు తీర్చే రాజకీయ వ్యవస్థ ఉండాలని, బీఆర్ఎస్తోనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఆయన ప్రసంగించారు. సామాజిక పురోగతి కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం నడుంకట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో చేసి చూపించిన దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేద్దామని కేకే కోరారు. దేశంలో ఇప్పటివరకు ఉన్న పార్టీలు సామాజికన్యాయం విషయంలో విఫలమయ్యాయని, 75 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా పేద ప్రజల స్థితిగతుల్లో మార్పురాలేదని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడేలా పనిచేసేవారికి మనవంతు చేయూతను అందిద్దామని అన్నారు. తెలంగాణాలో ఇప్పటికే అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు దేశంలోని ప్రతీ ఒక్కరికి అందాలని ఆయన ఆకాంక్షించారు. జాతీయస్థాయిలో బీఆర్ఎస్ విజయం సాధించాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు.