సంగారెడ్డి, జనవరి 9 (నమస్తే తెలంగాణ): దేశంలోని మిగతా రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా అమలవుతున్నాయని ఐజేయూ అధ్యక్షుడు వినోద్కోహ్లీ ప్రశంసించారు. సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు అండగా ఉన్నారని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్లో జరుగుతున్న ఐజేయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశాలు సోమవారానికి రెండోరోజుకు చేరా యి. తెలంగాణ అతిథ్యం బాగుందని వేర్వేరు రాష్ర్టాలకు చెందిన సీనియర్ జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పనితీరును ప్రశంసించారు. ఐజేయూ అధ్యక్షుడు కోహ్లీతోపాటు వివిధ రాష్ర్టాల సీనియర్ పాత్రికేయులు తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమం, సీఎం కేసీఆర్ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. నమ్మశక్యంకానీ రీతిలో జర్నలిస్టుల సంక్షేమం తెలంగాణలో చూస్తున్నామని వేదికపైన చప్పట్లతో అభినందించారు. ఐజేయూ రెండోరోజు కార్యక్రమాలను ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పరిశీలించారు. ఐజేయూ ప్రతినిధులతో పలు అంశాలపై వారు ముచ్చటించారు. కార్యక్రమంలో ఐజేయూ ప్రధాన కార్యదర్శి సభా నాయకన్, సురేశ్ అఖారీ, సబీన ఇంద్రజిత్, స్మీజన్, నారాయణ్ ప్రధాన్, బాబురెడ్డి, మురళీ, టెమ్జు అధ్యక్షులు ఇస్మాయిల్, రమణకుమార్, కొండల్రావు తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధి
సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది. దేశంలోనే ఇతర రాష్ర్టాలతో పోలిస్తే అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ ముందున్నది. తెలంగాణ ఏర్పాటుకు ముందు హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో పర్యటించాను. గతంలో హైదరాబాద్లో తాగునీరు, కరెంటు సమస్యలు ఉండేవి. ప్రస్తుతం సీఎం కేసీఆర్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి చెందింది. కరెంటు, నీటి సమస్యలు లేవు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. తెలంగాణలో జర్నలిస్టు సంక్షేమ కార్యక్రమాలు బాగా ఉన్నాయి.
–హబీబ్ ఖాన్, ఐజేయూ చీఫ్ రిటర్నింగ్ ఆఫీసర్
తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమం బాగుంది
దేశంలోని ఇతర రాష్ర్టాల కంటే తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి. సీఎం కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ వారికి అండగా ఉంటున్నారు. దేశంలోని మిగతా రాష్ర్టాలకంటే తెలంగాణలో ప్రతికా స్వేచ్ఛ ఎక్కువగా ఉన్నది. మోదీ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. జర్నలిస్టులకు అత్యంత ముఖ్యమైన వేజ్బోర్డును నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతున్నది. జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయి. దీనిని ప్రతిఒక్కరూ ఖండించాలి. దేశంలో ఫ్రీ పెస్ అవసరం ఎక్కువగా ఉన్నది. జర్నలిస్టులు కూడా బాధ్యతాయుతంగా వార్తలు రాయాల్సిన అవసరం ఉన్నది. – వినోద్ కోహ్లీ ఐజేయూ జాతీయ అధ్యక్షుడు
వేగంగా తెలంగాణ అభివృద్ధి
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఇక్కడ పర్యటించాను. అప్పటితో పోలిస్తే ఇప్పుడు తెలంగాణ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ అభివృద్ధ్దిలో ముందున్నది. తెలంగాణలో 20 వేల మంది జర్నలిస్టులు హెల్త్ సర్వీసులు పొందడం మామూలు విషయం కాదు. ఇక్కడ వేలమందికి అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చారు. మిగతా రాష్ర్టాల్లో ఎక్కడా జర్నలిస్టు సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
– సుమేశ్ దేబేకు, ఐజేయూ సభ్యుడు
జర్నలిస్టులకు కేసీఆర్ అండగా ఉన్నారు
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక్కడి జర్నలిస్టులకు అండగా నిలుస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా జర్నలిస్టు సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయి. తెలంగాణ జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం సీఎం కేసీఆర్ హెల్త్కార్డులు ఇవ్వడం ప్రశంసనీయం. దేశంలోని ఇతర రాష్ర్టాల్లో ఎక్కడా ఇది అమలు చేయడం లేదు. జర్నలిస్టుల భద్రత పెద్ద సవాలుగా మారుతున్నది. ప్రభుత్వాలు మీడియాను కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తున్నాయి. జర్నలిస్టులు భయంభయంగా పనిచేయాల్సి వస్తున్నది. వర్కింగ్ జర్నలిస్టు యాక్టును కేంద్రం అమలు చేయాలి. దేశంలో జర్నలిస్టులు ఉద్యోగభద్రత, పెన్షన్, బీమా సౌకర్యం కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
–సబీనా ఇంద్రజిత్, ఇంటర్నేషనల్ జర్నలిస్టు ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్