వనపర్తి : తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల తెలంగాణలో నీటి మట్టం గణనీయంగా పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.వనపర్తిలో ఆదివారం నిర్వహించిన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలలో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ చర్యలతో ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని తెలిపారు.
వనపర్తికి సాగునీటి రాకతో వ్యవసాయ సాగు ఉత్పత్తులు పెరిగాయని అన్నారు.రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతుల చేతుల్లో 92.5 శాతం భూమి ఉండగా గిరిజనుల చేతిలో 19 లక్షల ఎకరాల భూమి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో అభివృద్ధి, సంక్షేమంలో అనితర మార్పు వచ్చిందని పేర్కొన్నారు. 75 ఏళ్లలో సాధ్యంకానిది సీఎం కేసీఆర్ దూరదృష్టితో తీసుకుంటున్న కార్యక్రమాల వల్ల మార్పు సాధ్యమవుతుందని వెల్లడించారు.
గిరిజనుల సమావేశాలు, సామూహిక కార్యక్రమాల కోసం ప్రభుత్వం సేవాలాల్ మహరాజ్ భవనాన్ని నిర్మించిందని వెల్లడించారు.తెలంగాణ ఉద్యమంలో ఇచ్చిన మాట ప్రకారం తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని వెల్లడించారు.తండాలను పంచాయతీలుగా మార్చడంతో ‘ మన తండాలో మన రాజ్యం’ కల సాకారమైందని పేర్కొన్నారు.ప్రతి తండాకు నూతన గ్రామపంచాయతీ భవనాలు, బీటీ రహదారుల నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు.