TS Polling | హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి ఓటింగ్శాతం తగ్గిపోయింది. 2018లో 73.37శాతం పోలింగ్ నమోదుకాగా, ఈ సారి అది 71.34 శాతమే నమోదయ్యింది. మొత్తంగా 2.03శాతం మేర ఓటింగ్ తగ్గిపోయింది. ఈ మేరకు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ వివరాలు వెల్లడించారు. ఈ సారి పోలింగ్లో జిల్లాలవారీగా అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.36 శాతం ఓటింగ్ నమోదుకాగా, అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 47.88 శాతమే నమోదయ్యింది. ఎన్నికల పోలింగ్ గణాంకాలను పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లోనే ఓటింగ్ శాతం తక్కువగా నమోదయ్యింది. అన్ని విషయాల్లో బాధ్యతాయుతంగా ఉండే మహానగర ఓటర్లు ఎన్నికల్లో మాత్రం చివరిస్థానంలో నిలుస్తున్నారు. ఏ ఎన్నికలైనా 50 శాతానికి మించి పోలింగ్ నమోదుకావడం లేదు.
2018 ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో 48.89 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి 47.88 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. అంటే గతంతో పోల్చితే 1.01 శాతం తక్కువగానే నమోదయ్యింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే హైదరాబాద్లో అత్యల్పంగా పోలింగ్ జరుగడం శోచనీయం. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో పరిశీలిస్తే గోషామహల్లో 55.38 శాతం నమోదు కాగా, అతి తక్కువగా యాకుత్పురలో 39.64 శాతం నమోదయ్యింది. ఓటింగ్లో పురుషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పురుషులు 11,29,959 మంది ఓటు హక్కును వినియోగించుకోగా, 10,42,087 మంది మహిళలు సద్వినియోగం చేసుకొన్నారు.
మహానగరంలో కోటి మందికి పైగా నివసిస్తున్నారు. అయితే గ్రేటర్ ఓటర్లు ప్రతిసారి ఎన్నికలకు దూరంగా ఉండటంతో ఓటింగ్ శాతం చాలా తకువగా నమోదవుతున్నది. ఓటర్లలో నిర్లిప్తతతో పోలింగ్ కేంద్రాలకు రావడం లేదనే విమర్శలున్నాయి. ఉత్సాహంగా ఓటు వేసేలా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టిసారించినా ముఖ్యంగా చదువుకున్న వారు, ఐటీ ఉద్యోగులు, యువత ఓటువేసేందుకు నిరాసక్తత చూపుతున్నారు. దీంతో ఎన్నికలు ఏవైనా పోలింగ్ 50శాతానికి దాటడం లేదు.