జయశంకర్ భూపాలపల్లి. అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ) : ఎన్నికలు ఏవైనా మేం బీఆర్ఎస్ వెంటే ఉంటం.. కారు గుర్తుకే మా ఓటు.. ఏ పార్టీకీ ఇక్కడ చోటు లేదు.. మా ఓటు గండ్ర వెంకటరమణారెడ్డి(MLA Gandra Venkataramana Reddy) కే అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గుడాడ్పల్లి గ్రామస్తులు స్పష్టం చేశారు.
గుడాడ్పల్లిలో ఇటీవల 40 డబుల్బెడ్రూ ఇండ్లను గ్రామంలోని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయగా వారు గృహప్రవేశం చేశారు. కాగా మంగళవారం భూపాలపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ఆయన సతీమణి గండ్ర జ్యోతిని గ్రామస్తులు గ్రామానికి ఆహ్వానించి కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న గండ్ర దంపతులకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఇంటింటికి పిలిచి బొట్టు పెట్టి శాలువాతో సన్మానించారు. అనంతరం గ్రామ సర్పంచ్ ఉడుత లక్ష్మీఐలయ్య యాదవ్ అధ్యక్షతన కృతజ్ఞత సభ ఏర్పాటు చేసి గ్రామస్తులమంతా మీ వెంటే ఉంటామని గండ్ర వెంకటరమణారెడ్డికి హమీ ఇచ్చారు. ఆది నుంచి మా గ్రామం బీఆర్ఎస్ వెంటే ఉన్నదని, ఇప్పుడు కూడా మీ వెంటే ఉంటామని నినాదాలు చేస్తూ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఇదే గ్రామానికి చెందిన జడ్పీ వైస్ చైర్పర్సన్ కళ్లెపు శోభ రఘుపతిరావు దంపతులు, గ్రామ సర్పంచ్ ఉడుత లక్ష్మి ఐలయ్య యాదవ్ దంపతులు గండ్ర రమణారెడ్డి, జ్యోతిలకు తిలకం దిద్ది బట్టలు పెట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.