దంతాలపల్లి, ఏప్రిల్ 27 : విద్యార్థులకు మంచి చదువు, సత్ప్రవర్తన నేర్పించాల్సిన గురువే.. వారి పట్ల వంకరబుద్ధిని చూపాడు. చివరకు గ్రామస్తుల చేతిలో తన్నులు తిని పోలీస్ కేసు పెట్టేదాక తెచ్చుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురం గ్రామానికి చెందిన బి.మహేందర్.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
భార్యపిల్లలతో కలిసి గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అయితే పాఠశాలకు వచ్చే విద్యార్థులతో మహేందర్ అసభ్యంగా ప్రవర్తించేవాడు. తరచూ లైంగికంగా వేధిస్తుండడం, మాట్లాడడంతో విసిగిపోయిన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. బుధవారం వారంతా ఉపాధ్యాయుడి ఇంటికి వెళ్లి నిలదీశారు.
ఎంతో నమ్మకంతో బడికి పంపిస్తే ఇలా ప్రవర్తించడమేమిటని గ్రామస్తులు ఉపాధ్యాయుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం ఓ విద్యార్థిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు తొర్రూర్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ మురళీధర్రాజు తెలిపారు. ఇలాంటి ఉపాధ్యాయులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరారు.