హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విభజనపై వర్సిటీ అధికారులు పలు ప్రతిపాదనలు రూపొందించారు. వీటిని పాలకమండలి సమావేశంలో ఆమోదించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్ స్థానికత గల ఉద్యోగులను ఏపీకి పంపించడం, తదితర అంశాలు ఎజెండాలో ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం అటెండర్ నుంచి ఆచార్యుల వరకు 51 మంది ఏపీ స్థానికత గల వారు తెలంగాణలో పనిచేస్తున్నారు. వీరిని ఏపీకి కేటాయించాల్సి ఉన్నది. రాష్ట్ర విభజన నాటికి వర్సిటీలో రూ.14 కోట్ల వరకు బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. వీటిని ఏపీకి 58%, తెలంగాణకు 42% చొప్పున పంచుకోవాలి.
2014 నుంచి ఇప్పటివరకు వర్సిటీలోని బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, పెన్షన్లను తెలంగాణ ప్రభుత్వమే చెల్లిస్తున్నది. వీటిలో 58% నిధులను తెలంగాణకు ఏపీ చెల్లించాల్సి ఉన్నది. గత పదేండ్లల్లో వర్సిటీలో 55% ఉద్యోగులు పదవీ విరమణ పొందగా, వీరిలో 85% ఏపీ వారే ఉన్నారు. వీరి పింఛన్లను తెలంగాణ భరిస్తున్నది. వర్సిటీని విభజించకపోతే ఇదంతా తడిసిమోపెడయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టం 10వ షెడ్యూల్లోని సంస్థలను 2024లోపు విభజించకుంటే తెలంగాణపై మరింత భారం పడే అవకాశం ఉన్నది. తెలుగు వర్సిటీ విభజనపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీతో ఈ నెల 27న ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి తాము వెళ్లడంలేదని, అక్కడ తీసుకునే నిర్ణయాలను బట్టి తాము నడుచుకుంటామని వర్సిటీకి చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.