హైదరాబాద్, జూన్ 25(నమస్తే తెలంగాణ): మంత్రులను పిలువలేదు.. అంతర్రాష్ట్ర అధికారులను భాగస్వాములను చేయలేదు.. ఎజెండా అంశాల ప్రస్తావనా లేదు. కేవలం కేంద్ర మంత్రి, కర్ణాటక, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు మాత్రమే గంట పాటు రహస్యంగా భేటీ అయ్యారు. పూర్తిగా గోప్యంగానే చర్చలు జరిపారు. తుదకు ఒప్పందాలు జరిగాయని, చరిత్రాత్మకమంటూ ప్రకటనలు మాత్రం చేశారు. ఏ అంశాలపై, ఏ విధంగా జరిగాయనేదీ మాత్రం ఎవరికీ తెలియదు. ఇదీ కర్ణాటక వేదికగా గురువారం జరిగిన చర్చల తీరు. అయితే కేవలం గేట్ల ప్రారంభోత్సవం అనేది ఒక సాకు మాత్రమేనని, కానీ భేటీలో ప్రధానంగా ఏపీ ప్రతిపాదించిన గోదావరి-కావేరీ వయా నల్లమలసాగర్ ప్రణాళికలపైనే చర్చ కొనసాగిందని విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా కర్ణాటకకు తాయిలాలు ప్రకటించినట్టు సైతం తెలుస్తున్నది. రేవంత్రెడ్డి సర్కార్ మాత్రం మొక్కుబడిగా వినతిపత్రాలు ఇచ్చి చేతులు దులుపుకొన్నట్టు సమాచారం.
తుంగభద్ర డ్యామ్కు బిగించిన నూతన గేట్ల ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డిని కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ ముగ్గురు కర్ణాటకకు వేర్వేరుగానే వెళ్లారు. ప్రారంభోత్సవానికి ముందే గంట పాటు కేంద్ర మంత్రి, ముగ్గురు సీఎం మాత్రమే ప్రత్యేకంగా ఎయిర్పోర్టులో భేటీ అయ్యారని తెలిసింది. వారి వెంట ఆయా రాష్ర్టాల సాగునీటి పారుదల శాఖ మంత్రులున్నా భేటీలో భాగస్వాములను చేయలేదు.
అధికారులను సైతం డ్యామ్ వద్దకే పరిమితం చేశారు. వారు లేకుండానే రహస్యంగా చర్చలు జరిపారు. చివరి 10 నిమిషాల ముందు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితోపాటు ఆయా రాష్ర్టాల మంత్రులకు సమాచారమిచ్చినట్టు సమాచారం. వారు వచ్చిన తర్వాత మొక్కుబడిగా పలు అంశాలపై చర్చించారని తెలిసింది. అక్కడినుంచి నేరుగా గేట్ల ప్రారంభోత్సవానికి వెళ్లి, ఆపై బహిరంగ సభలో పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి పాటిల్ సమక్షంలో జరిగిన ఈ భేటీ చరిత్రాత్మకమని ఆ తర్వాత ప్రకటనలు వెలువడ్డాయి. కీలక అంశాలపై చర్చలు కొలిక్కి వచ్చాయని, ఒప్పందాలు జరిగాయని వెల్లడించారు. అయితే ఏ అంశాలు, ఎలాంటి ఒప్పందాలు జరిగాయనేది కేంద్ర మంత్రి, ఏ ముఖ్యమంత్రి ప్రకటించలేదు. త్వరలోనే విధానపర నిర్ణయాలు వెలువడ్డాయని మాత్రం తెలిపారు. అయితే ఈ భేటీ అనేది కీలకంగా ఏపీ ప్రతిపాదించిన పోలవరం-నల్లమలసాగర్-కావేరీ లింక్ ప్రాజెక్టుపైనేనని విశ్వసనీయ సమాచారం. గేట్ల ప్రారంభోత్సవం, అంతర్రాష్ట్ర సమస్యలపై చర్చలు కేవలం ఒక ముసుగు మాత్రమేనని అధికారవర్గాలే తెలుపుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ భేటీలో కర్ణాటకకు కేంద్రం భారీగానే తాయిలాలు ప్రకటించినట్టు తెలుస్తున్నది. తుంగభద్ర డ్యామ్కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా నావలి రిజర్వాయర్ను విస్తరించే పనులకు రూ.5వేల కోట్లు, అలాగే బెడ్తి-వరద లింకు ప్రాజెక్టుకు మరో రూ.15వేల కోట్లతోపాటు మరికొన్ని వరాలు కురిపించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రతిపాదనలకు కర్ణాటక సైతం అంగీకారం తెలిపినట్టు సమాచారం. మరోవైపు గతంలో కొడంగల్కు అనుమతులు ఇచ్చిన తరహాలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్వోసీ ఇస్తామని సైతం ప్రతిపాదించడం, అందుకు రేవంత్రెడ్డి సర్కార్ అంగీకారం తెలిపినట్టు విశ్వసనీయ సమాచారం. మొత్తంగా ఈ భేటీలో ఏపీకి పూర్తి అనుకూలంగా నిర్ణయాలు జరిగాయని అధికారవర్గాలు అంటున్నాయి.
ఇదిలా ఉంటే భేటీకి ముందుకు తెలంగాణ సీఎం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఆర్డీఎస్ ఆనకట్ట సమస్యలతోపాటు తుంగభద్ర జల హక్కులు, పొరుగు రాష్ర్టాలతో ఉన్న జలవివాద అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వాటిపై నివేదిక రూపొందించాలని, కేంద్ర మంత్రితో జరిగే భేటీలో చర్చించేందుకు ఎజెండా సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర అంతర్రాష్ట్ర అధికారులు సైతం ఆ దిశగా నోట్స్ను సిద్ధం చేశారు.
కానీ ఈ భేటీలో అందులోని ఏ ఒక్క అంశాన్నీ ప్రస్తావించలేదని తెలుస్తున్నది. రాష్ట్ర అధికారులను సైతం అనుమతించలేదు. కేవలం తుంగభద్ర డ్యామ్ వద్దకే వారిని పరిమితం చేశారు. అక్కడే వేచి ఉండాలని ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది ఆదేశించినట్టు సమాచారం. అధికారులెవరూ లేకుండానే సీఎం చర్చల్లో పాల్గొన్నారు. చివరి నిమిషంలో మొక్కుబడిగా రాష్ట్ర అధికారులు ఇచ్చిన నోట్స్ను కేంద్రమంత్రికి అందించారని తెలిసింది.