హైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ): కొద్దిరోజుల కిందట వెలుగుచూసిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు యువ ప్రజాప్రతినిధుల పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ఒకరు యువ ఎంపీ కాగా, మరొకరు యువ ఎమ్మెల్యే! ఆ రోజు మొయినాబాద్ డ్రగ్స్ పార్టీకి వారు కూడా రావాల్సి ఉండగా.. ఈగల్ పోలీసులు దాడి చేయబోతున్నారనే సమాచారంతో వారు వెనక్కి వెళ్లిపోయారని తెలిసింది. ఈ నెల 14న మొయినాబాద్, అజీజ్నగర్లోని ఫామ్హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీపై ఈగల్ బృందం, స్థానిక, ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా కలిసి దాడులు చేశారు. ఆ సమయంలో నిందితులు పోలీసులపై కాల్పలకు తెగబడగా, ప్రత్యేక బృందాలు చాకచక్యంగా పార్టీలో పాల్గొన్న 11 మందిని అదుపులోకి తీసుకున్నాయి.
నిందితులకు ర్యాపిడ్ టెస్ట్ చేయించగా, వారిలో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. వీరిలో పార్టీ నిర్వాహకుడితోపాటు పోలీసులపై కాల్పులు జరిపిన నమిత్శర్మ, రితేశ్రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. మిగిలిన వారికి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసి, డ్రగ్స్ నెటెవర్క్ను ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. నిందితులను తమ కస్టడీలోకి తీసుకున్న సిట్ బృందం ఐదు రోజులపాటు జరిపిన విచారణలో అనేక కీలక విషయాలు బయటపడ్డాయని విశ్వసనీయ సమాచారం.
మొయినాబాద్ డ్రగ్స్ కేసు విచారణలో అధికార పార్టీకి చెందిన ఒక లోక్సభ సభ్యుడితోపాటు ఒక ఎమ్మెల్యే పేరు కూడా తెరపైకి వచ్చిందని తెలిసింది. వాస్తవానికి, ఆ పార్టీకి వచ్చే ప్రముఖుల జాబితాలో ఆ ఇద్దరి పేర్లు కూడా ఉన్నాయని సమాచారం. సదరు ఎంపీ ఆ పార్టీలో పాల్గొనేందుకు ఫామ్హౌస్కు రావాల్సి ఉండగా, అంతలోనే పోలీసులు దాడులు చేయడంతో సదరు ఎంపీ త్రుటిలో తప్పించుకున్నారని పోలీసు వర్గాల సమాచారం. మొయినాబాద్లో డ్రగ్స్ పార్టీ ఉన్నదనే సమాచారం ఉన్న ఓ పోలీసు అధికారి.. ముందస్తు సమాచారం వారికి ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఆ పార్టీకి రావాల్సిన వారి జాబితాలో పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలు, రియల్ఎస్టేట్ వ్యాపారులు, హైదరాబాద్ నగరంలోని రెండు కార్పొరేట్ దవాఖానలకు చెందిన వైద్యులు కూడా ఉన్నారని సమాచారం. వీరిలో చాలామంది డ్రగ్స్ను వినియోగిస్తున్నారని, మరికొంత మంది డ్రగ్స్ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా కూడా దర్యాప్తు బృందం విచారణ జరుపుతున్నదని సమాచారం.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు ఆ యువ ప్రజాప్రతినిధుల జోలికి పోలీసులు, సిట్ రాకుండా చూసుకుంటున్నట్టు తెలిసింది. అందుకే కేసు విచారణ ఇంత జోరుగా సాగుతున్నా.. ప్రముఖులు ఈ నెట్వర్క్లో బయటికి వస్తున్నా.. వారి పేర్లు రాకుండా అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. సదరు సీనియర్ నేతను చూసే నేటికీ వారిద్దరి జోలికి సిట్, ఈగల్ టీమ్ వెళ్లడం లేదని అనుకుంటున్నారు.
ఇక ఆ పార్టీకి హాజరుకావాల్సిన వారి గురించి దొరికిపోయిన నిందితుల విచారణలోనూ వారి పేర్లు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసింది. యువ ప్రజాప్రతినిధులు ఉన్నారనే సమాచారం ‘ముఖ్యనేత’కు కూడా తెలియడంతో.. ఆ సీనియర్ నేత నేరుగా మాట్లాడినట్టు తెలిసింది. మొత్తానికి మొయినాబాద్ డ్రగ్స్ ఎపిసోడ్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను కాపాడుకొనేందుకు ప్రభుత్వ పెద్దలు, పోలీసు పెద్దలు నానా తంటాలు పడుతున్నారని సమాచారం.