మహబూబాబాద్ : సేవ భావంతో పనిచేసే వ్యక్తులకు ప్రభువు తోడుగా ఉంటాడని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సేవలో సంతృప్తి ఉంటుందని, సేవభావంతో మెలిగితే ప్రభువుకు సేవ చేసినట్లేనని పేర్నొన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చింతలపల్లి గ్రామంలో ఈనేపలి ఎలిషమ్మ, యాకోబు దంపతులు నిర్మించిన చర్చిని శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ పాపాలు చేసినవాళ్లు కార్లలో తిరిగినా, బిల్డింగులు కట్టినా, భోగాలు అనుభవించినా అది తాత్కాలికం. పుణ్యం చేసిన వారికి వెంటనే లాభం జరగకపోయినా వారి పిల్లలకు మేలు జరుగుతుంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ సేవ చేయడమే నిజమైన ప్రభువు సేవ’ అని అన్నారు.
దేవుడు అన్ని రూపాల్లో ఉంటాడని, ప్రతి ఒక్కరూ అన్ని మతాలను గౌరవించాలని సూచించారు.
ఏ మతాన్ని విమర్శించినా, కించపరిచినా వారు పాపాత్ములవుతారని పేర్కొన్నారు.ప్రభువు పేదలకు సహాయం చేశాడని, ఆయన సేవలు గుర్తుంచుకోవాలన్నారు. ఆపద వచ్చిన వారికి అండగా ఉండాలని కోరారు.