హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పాతబస్తీలో మెట్రోరైల్ పనులను చేపట్టేందుకు ముహూర్తం ఖరారైంది. మొదటి దశ మెట్రో ప్రాజెక్టులోని కారిడార్-2లో భాగంగా ఎంజీబీఎస్ నుం చి ఫలక్నుమా మధ్య నిర్మించాల్సిన ఈ 5.5 కి.మీ. గ్రీన్లైన్ పనులకు సీఎం రేవంత్రెడ్డి 8న శంకుస్థాపన చేయనున్నట్టు హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సోమవారం ప్రకటించారు.
దారుల్షిఫా నుంచి ఆలియాబాద్ మీదుగా సాగే ఈ మార్గంలో సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్నుమా వద్ద 4 మెట్రో స్టేషన్లు ఉంటాయి. పాతబస్తీ కారిడార్లో రోడ్ల విస్తరణ వల్ల మొత్తం 1,100 ఆస్తులు ప్రభావితమవుతాయని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ మార్గంలోని ప్రతి మెట్రో స్టేషన్ వద్ద 120 అడుగులు, మిగిలిన ప్రాంతాల్లో 100 అడుగుల విస్తీర్ణంతో రోడ్లు ఉండేలా డిజైన్ చేసినట్టు చెప్పారు. మెట్రోరైల్ రెండో దశలో నాగోల్-శంషాబాద్ ఎయిర్పోర్టు మార్గంలో చాంద్రాయణగుట్ట వద్ద అనుసంధానిస్తామని వివరించారు. చాంద్రాయణగుట్ట వద్ద మేజర్ ఇంటర్చేంజ్ స్టేషన్ను నిర్మించాల్సి ఉంటుందని తెలిపారు.