Congress | రాజన్న సిరిసిల్ల, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయం తర్వాత లక్షలాది మందికి ఉపాధి కల్పించే వస్త్ర పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో కునారిల్లుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాంచాలకు సంకెళ్లు పడ్డాయి. ఇప్పటి వరకు వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు లేకపోవడం వల్ల మర చక్రాలు కదలడం లేదు. మరో వైపు రూ.290 కోట్ల పాత బకాయిలు విడుదల చేయకుండా కొత్త ప్రభుత్వం నేతన్నలకు రిక్త హస్తం చూపుతున్నది. దీంతో మూడు నెలలుగా పనిలేక బతుకు భారమై ఓ యువ నేతన్న ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది.
రాష్ట్రంలోనే అత్యధిక మరమగ్గాలతో సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమ వేలాది మందికి బతుకు దెరువు ఇస్తున్నది. సమైక్యరాష్ట్రంలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్లకు స్వరాష్ట్రంలో జవసత్వాలు వచ్చాయి. ఉద్యమ నాయకుడిగా. ముఖ్యమంత్రిగా కేసీఆర్ నేతన్నలకు నేనున్నాంటూ భరోసా ఇచ్చారు. సిరిసిల్లకు బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్ తోఫా, విద్యార్థులకు యూనిఫాంల తయారీ ఆర్డర్లు ఇస్తూ నేతకార్మికులకు ఏడాది పొడవునా జీవనోపాధి కల్పించారు. ప్రతి సంవత్సరం సుమారు రూ. 300 కోట్ల వరకు ఆర్డర్లు ఇచ్చి, కార్మికుల సంక్షేమం కోసం త్రిప్టు, నేతన్న బీమా, యారన్ సబ్సిడీ పథకాలను అమలు చేశారు. అంతేకాకుండా నేత కార్మికులకు యాభై ఏండ్లకే నెలకు రూ.2016 పింఛను ఇచ్చి ఆసరా అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం కల్పించిన భరోసాతో నేతన్నలు వలసలు వాపస్ వచ్చారు. కేసీఆర్ పాలనలో సంక్షేమం వైపు పయనించిన వస్త్ర పరిశ్రమ ప్రభుత్వమార్పుతో మళ్లీ సంక్షోభంలోకి కూరుకుపోతుంది.
సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు ప్రభుత్వం రూ.290 కోట్లు బకాయి పడింది. బతుకమ్మ చీరలకు సంబంధించి రూ.200ల కోట్లు, ఆర్వీఎం బకాయిలు రూ.70 కోట్లు, యారన్ సబ్సిడీలవి మరో రూ.20కోట్లు రావాలని యజమానులు చెపుతున్నారు. ప్రభుత్వం వెంటనే చెల్లిస్తుందన్న నమ్మకంతో అప్పులు తెచ్చి చీరలు తయారు చేసిన యజమానులకు కాంగ్రెస్ సర్కారు పైసలు ఇవ్వకపోవడంతో సాంచాలు నడిపించే స్థోమతలేక బంద్ పెట్టారు. గత ప్రభుత్వం ప్రతి ఏటా ఫిబ్రవరి చివరి వారంలోనే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు వాటి ఊసెత్తడం లేదు. ఒకవైపు పైసలు ఇవ్వక, మరోవైపు కొత్త ఆర్డర్లకు జీవో రాకపోవడంతో మూడు నెలలుగా మరమగ్గాలు మూతపడ్డాయి. కార్మికులు పనిలేక పస్తులుంటున్నారు. కడుపులు కాలి దిక్కుతోచని, దయనీయ పరిస్థితిలో కార్మికులు రోడ్డెక్కి నిరసనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పనిలేక సోమవారం యువ నేత కార్మికుడు ఉరిపెట్టుకోవడంతో కార్మిక కుటుంబాలలో ఆందోళన వ్యక్తమవుతున్నది. పదేండ్ల తరువాత పాత రోజులు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని కార్మికులు కోరుతున్నారు. బకాయిలు విడుదల చేసి, చేతి నిండా పని కల్పించాలని గురువారం నుంచి సిరిసిల్లలో రిలేదీక్షలు చేపట్టేందుకు నేత కార్మికులు సిద్ధం అవుతున్నారు.
హైదరాబాద్, మార్చి 13(నమస్తే తెలంగాణ): చేనేత కార్మికుల ఆత్యహత్యల్ని నివారించాలని, ఇందుకు అవసరమైన చర్యల్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి సీఎం రేవంత్రెడ్డికి బుధవారం లేఖ రాశారు. సిరిసిల్లలో తడుక శ్రీనివాస్ అనే చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. ఆత్యహత్యలు ఇంతటితో ఆగిపోయేలా చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ప్రస్తుత ప్రభుత్వం బకాయిలు రూ.290 కోట్లు ఇవ్వక, బతుకమ్మ చీరల ఆర్డర్ల జీవో విడుదల చేయక పోవడం వల్ల పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. కార్మికులు పస్తులుండే పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం వెంటనే స్పందించాలని నేటి నుంచి సిరిసిల్లలో రిలేదీక్షలు చేపడుతున్నాం. చేనేత పవర్లూం కార్మికుల అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి రూ.1000 కోట్ల నిధులు కేటాయించాలి. రాష్ట్ర వ్యాప్తంగా టెస్కోకు ఇవ్వాల్సిన బకాయిలు మొత్తం రూ.485.89 కోట్లు వెంటనే విడుదల చేయాలి.