వరంగల్: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం తన స్వస్థలమైన పర్వత గిరిలో వేణుగోపాల స్వామి ఆలయం, పర్వతాల గుడి శివాలయాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేణుగోపాల స్వామి ఆలయం అభివృద్ధికి ప్రభుత్వం రూ. 50 లక్షలు మంజూరు చేసిందని, భక్తి భావం ఉట్టిపడేలా ఆలయాన్ని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
స్వామివారికి నూతన రథాన్ని తయారు చేయించాలని, స్థల సేకరణ చేసి కల్యాణ మంటపం నిర్మించాలని సూచించారు. పర్వతాలగిరిపై ఐదు కోట్ల రూపాయలతో శివాలయం నిర్మించారని ఈ ఆలయాన్ని జనవరి 26న ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆలయానికి కావలసిన విద్యుత్, మంచినీటి వసతి, రవాణా, భక్తుల సదుపాయాల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
శివాలయానికి వచ్చే భక్తుల వాహనాలను నిలిపేందుకు విశాలమైన స్థలంలో పార్కింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్డీవో ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇన్చార్జి డీపీవో సంపత్ రావు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత, ఏసీపీ నరేష్ కుమార్, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు